తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆయా రాష్ట్రాల అభివృద్ది కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు కొత్త కొత్త పథకాలు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగంపై ఎన్నో మార్పులు చేర్పులు తీసుకు వస్తున్నారు. ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీల అక్రమాలపై కొరడా ఝులిపిస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వ పాఠశాలల అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఇక తెలంగాణలో సీఎం కేసీఆర్ కేజీ టూ పీజీ పథకాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ కాలేజీకి ఫైబర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని, డిజిటల్ క్లాస్లు ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడారు.
హైస్కూళ్లలోనూ వైఫై సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. కౌన్సెలింగ్, ఎస్ఎంఎస్ ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతిపై సమాచారం ఇచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆంధ్రని నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.