రాష్ట్ర, జాతీయ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచడం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు డిజిటల్ దిశగా అడుగులు వేస్తోంది. అందుకు ప్రత్యేకంగా నూతన విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటల్ విధానానికి అనుగుణంగా కంప్యూటర్ లేదా మొబైల్ నుంచి చదువుకునేలా ఓ ఐటీ కంపెనీతో కలిసి కసరత్తు చేస్తోంది.
మొబైల్, కంప్యూటర్లలో ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకున్నాక అంతర్జాలం సదుపాయం లేకున్నా దీన్ని ఉపయోగించకోవచ్చు. ఇంటర్ విద్యార్థులు పాఠ్య పుస్తకాలు చదువుకోవడం, వాటిపై వీడియోలు చూడటంతోపాటు ఎంసెట్, జేఈఈ పరీక్షలు, నీట్, సీఏ-సీపీటీ లాంటి వాటికి సన్నద్ధం కావచ్చు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉచితంగా, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు నామమాత్రపు రుసుంతో దీన్ని పొందవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది.