అడివికి దగ్గరగా ఉన్న పోతురాజుగూడెం ప్రజలు అక్కడ ఉన్న ఫ్యాక్టరీల నుండి వచ్చే దుమ్ము దూళితో రోగాన పడుతుంటారు. ఇక అక్కడ ఉన్న డాక్టర్ కూడా అమ్మాయిల పిచ్చి వాడు. కనీసం ఆర్.ఎం.పి కూడా కాని భిక్షపతి (పోసాని కృష్ణ మురళి)ని మెడికల్ ఆఫీసర్ చేస్తాడు జె.కె భరద్వాజ్ (మురళి శర్మ). తన పలుకుబడితో అక్కడ ఎన్ని ప్రాణాలు పోతున్నా తన ల్యాబ్ కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాడు. అయితే అలాంటి దుశ్చర్యలు చేస్తున్న పోతురాజుగూడెం ప్రజల గోడుకు గొంతుగా మారే ప్రయత్నం చేస్తుంది శ్రీపాదం శ్రీనివాస్ రావు (కృష్ణ) అలియాస్ శ్రీ శ్రీ కూతురు శ్వేత (అంగన రాయ్).
స్పై టివిలో పనిచేస్తున్న శ్వేత జె.కె గ్రూప్స్ చేస్తున్న ఆగడాలను అరికట్టాలనుకుంటుంది. అయితే ఇంతలో ఆమెను దారుణంగా చంపేస్తారు జె.కె గ్రూప్ వారసులు. అయితే తన కూతురిని చంపిన వారి మీద కేస్ వేస్తే అది కాస్త తప్పుడు సాక్ష్యాలతో కేసు మూతబడేలా చేస్తారు. ఇక అందుకే తానే తన కూతురు చావడానికి కారకులైన వారిని చంపేయాలని నిర్ణయించుకుంటాడు శ్రీ శ్రీ దానికి శ్రీ శ్రీ శ్రీమంతి సుమతి (విజయ నిర్మల) కూడా సహకారం అందిస్తుంది. అసలు జె.కె గ్రూప్స్ చేస్తున్న ఏ పనులను శ్వేత భయటపెట్టే ప్రయత్నం చేసింది..? శ్వేతను చంపిన వారికి శ్రీ శ్రీ ఎలాంటి శిక్ష వేశాడు..? కథ ఎలా సుఖాంతం అయ్యిందనేదే సినిమా.
సూపర్ స్టార్ కృష్ణ గోల్డెన్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మరోసారి తన అభిమానుల కోసం ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. తన వయసుకి తగ్గ పాత్రలో తన కూతురు అన్యాయానికి బలైందనే బాధతో ఓ వైపు కుమిలిపోతూనే మరో వైపు చంపిన వారి మీద కక్ష్య సాధించే పాత్రలో అద్భుతంగా నటించారు నటశేఖర కృష్ణ. ఎన్నో వందల సినిమాలు చేసినా ప్రస్తుత సినిమా తన కొత్త సినిమాలా ఫీల్ అవుతూ తన గ్రేస్ చూపించారు కృష్ణ. అయితే వయసు మీద పడటం వల్ల ఎక్కువగా స్టాండింగ్ డైలాగ్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చారు. శ్రీ శ్రీగా కృష్ణ గారు మరోసారి కేక పెట్టించేశారు. ఇక సుమతిగా నటించిన విజయ నిర్మల గారు కూడా తన సహజ నటనను మరోసారి ప్రదర్శించారు. సినిమాలో కృష్ణ , విజయ నిర్మల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయి.
ఇక శ్రీ శ్రీ లో ఏ.సి.పి అజయ్ కుమార్ గా సీనియర్ హీరో నరేష్ ఓ ఫుల్ లెంథ్ పాత్రలో నటించి మెప్పించారు. మర్డర్ మిస్టరీని కనిపెట్టే ప్రయత్నంలో నరేష్ పోతు రాజు గూడెం వెళ్లి అక్కడ సూర్య (సాయి కుమార్) ను కలిసినప్పుడు వచ్చే సన్నివేశాల్లో గొప్పగా నటించాడు. ఇక సినిమాలో మరో విశేషం ఏంటంటే తన కెరియర్ లో ఇంతవరకు తన తల్లి నాన్న సమానుడైన సూపర్ స్టార్ కృష్ణ గార్లతో కలిసి నటించే అవకాశం దక్కించుకుని దానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు నరేష్. ఇక సూర్యగా తిరుగుబాటు దారుడిగా మరోసారి తన సత్తా చాటాడు సాయి కుమార్. ఆయన డైలాగుల్లోని పవర్ సినిమా కాన్సెప్ట్ ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది.
ఓ సీన్ లో నరేష్ తో 'తన కుంటి కాలు గురించి చెబుతూ వ్యవస్థే కుంటుతుంది నాదేముంది' అన్న డైలాగ్ బాగుంటుంది. ఇక జె.కె గా నటించిన మురళి శర్మ, పోసానిలు తమ పాత్రలకు న్యాయం చేశారు. జె.కె వారసులుగా విలాసాలకు అంకితమయిన యువ తేజాలు రాహుల్, విక్కి, ఆకాశ్ లు కూడా బ్యాడ్ బాయ్స్ లా బానే చేశారు. ఇక సినిమా కథకు కారణమైన అంగన రాయ్ తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇక స్క్రీన్ మీద చివర్లో వెలుగులు పండించాడు సుధీర్ బాబు. నరేష్ ను విష్ చేసే పోలీస్ ఆఫీసర్ కృష్ణ మనోహర్ గా సుధీర్ బాబు సూపర్ అనిపించుకున్నాడు.