'హృదయ కాలేయం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబుకు మంచి క్రేజ్ వచ్చినా ఆ తరువాత సినిమాలు ఊహించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో సంపూ కెరియర్ ఇప్పడు కొద్దిగా స్లో గా నడుస్తోంది. ఈ నేపధ్యంలో అతడు లేటెస్ట్ గా నటిస్తున్న 'కొబ్బరి మట్ట' సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఆ ఆశలకుఇప్పుడు మెగా కాంపౌండ్ సపోర్ట్ రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
సంపూ బాబు లేటెస్ట్ మూవీ' కొబ్బరి మట్ట' టీజర్ లాంచ్ ఈరోజు జరుగుతోంది. ఈ లాంచింగ్ కు మెగా హీరో సాయి ధరమ్ తేజ రానున్నాడు. ఈ విషయాన్ని 'కొబ్బరి మట్ట టీమ్' సంపూర్ణేష్ బాబు తన ట్విటర్ ద్వారా తెలియ చేసాడు. అంతేకాదు ‘కొబ్బరి మట్ట' సినిమా ఎడిటింగ్లో తన నటనను చూసి తానే పరవశం చెందానని చెపుతూ తన నటనను ఎడిటింగ్లో చూసుకొని తన జన్మకు ఇది చాలనిపిస్తోందని అంటూ భారీ కామెంట్స్ చేసాడు. 'కొబ్బరి మట్ట' తన జీవితానికి దొరికిన ఒక ఆణిముత్యమని సంపూ తన సినిమాను తానే ఆకాశంలోకి ఎత్తేసుకున్నాడు.
'హృదయకాలేయం' ట్రైలర్ను తలదన్నేలా 'కొబ్బరి మట్ట' టీజర్ ఉంటుందనే ధీమా వ్యక్తం చేస్తున్న సంపూ మాటలు బట్టి ఈ సినిమా పై ఈ బర్నింగ్ స్టార్ కు ఎన్ని ఆశలు ఉన్నాయో అర్ధం అవుతుంది. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు మూడు పాత్రలలో కనిపించ బోతున్న విషయం తెలిసిందే.
'హృదయకాలేయం' చిత్రంతో సంపూని పరిచయం చేసిన స్టీవెన్ శంకర్ ఈ చిత్రానికి కూడ కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండగా రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాను మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమోట్ చేస్తూ ఉండటంతో ఈ మధ్య కాలంలో ఈ యంగ్ హీరో అదృష్టం అందరి అంచనాలను మించి పరుగులు తీస్తూ ఉండటంతో ఆ అదృష్టం ఈ బర్నింగ్ స్టార్ కు కూడ పడుతుంది అనుకోవాలి..