టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా ఎంఎస్ ధోనీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ప్రమోషన్‑లో యూనిట్‑తో పాటు ధోనీ కూడా పాల్గొనడంపై మరింత ప్రచారం వచ్చింది. త్వరలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. శుక్రవారమే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో ధోని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ‘ఎం.ఎస్.ధోని’ ట్రైలర్ గమనిస్తే.. ధోని పాత్రధారి సుశాంత్ సింగ్ రాజ్పుత్ నేరుగా పరీక్ష హాలు నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు బండి ఎక్కడం గమనించవచ్చు.
ఆ అనుభవం గురించి ధోని గుర్తు చేసుకుంటూ.. ‘‘ఆ సన్నివేశాలు చూస్తుంటే నాకు నవ్వొచ్చింది. నా చివరి పరీక్ష ముగియగానే అట్నుంచి అటే వెళ్లి రైలెక్కాను. నా యూనిఫామ్ విప్పడం కూడా మరిచిపోయా. ఐతే నేను పరీక్షలకు భయపడి ఇంటి నుంచి పారిపోతున్నా అనుకుని రైల్లో కొందరు పెద్దవాళ్లు నాకు హితబోధ చేయడం మొదలుపెట్టారు. నేను మ్యాచ్ కోసమే అలా వెళ్తున్నానని చెప్పేలోపే వాళ్లు నన్ను బలవంతంగా రైలు నుంచి దించేయాలని కూడా చూశారు’’ అని చెప్పాడు.
ట్రైలర్లో సుశాంత్ నోటి నుంచి వినిపించిన ‘‘ఆ ముగ్గురూ జట్టులో ఉండటానికి అర్హులు కారు’’ అన్న డైలాగ్ గురించి ధోని స్పందిస్తూ.. ‘‘సినిమా మొదలవడానికి ముందే స్పష్టంగా చెప్పా. నేను ఎవరి పేర్లూ బయటపెట్టనని. ఎందుకంటే నా కథలో ప్రతినాయకులు ఎవరూ ఉండకూడదు’’ అని తెలిపాడు. సినిమాలో తాను ఖరగ్పూర్లో టీటీఈగా ఉన్న రోజుల గురించి వివరంగా చూపించబోతున్నారని చెప్పిన ధోని.. తన జీవితంలో అవి ఎప్పటికీ మరిచిపోలేని రోజులన్నాడు.
టీటీఈగా ఉన్నపుడు తన క్రికెట్ సాధన గురించి మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ సాధన చేసుకోవడానికి బాగుంటుందని.. అప్పుడు నేను క్రీడా విభాగంలో చేరాను. ఐతే సమయం బాగానే దొరికేది కానీ.. మామూలు బంతితో సాధన చేయడానికి సహచరులు దొరికేవారు కాదు. దీంతో టెన్నిస్ బంతితో ఆడటం అలవాటు చేసుకున్నా. కానీ అక్కడ నా బ్యాటింగ్ నైపుణ్యం మెరుగుపరుచుకున్నదేమీ లేదు. అక్కడ మంచి బౌలర్గా ఎదిగాను’’ అని ధోని చెప్పాడు.