వైవిఎస్ చౌదరి హడావుడిగా నాలుగు సినిమాలు ప్రకటించేశాడు. అందులో రెండు సీక్వెల్ సినిమాలున్నాయి. లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య సినిమాలకు కొనసాగింపు చూపిస్తానని వైవీఎస్ చెబుతున్నాడు. నిజానికి ఇవి రెండూ ఓ మాదిరి సినిమాలు. వాటికి సీక్వెళ్లు అవసరమా? అనేది మొదటి ప్రశ్న. పైగా ఇవి సీక్వెల్ సినిమాకి తగిన కథలు కూడా కావు. లాహిరి లాహిరి.. తీస్తే అందుకు తగిన నటులున్నారా? పాత వాళ్లతో ఆసినిమా తీసే అవకాశాల్లేవు. స్టార్లు లేకుండా కొత్తవాళ్లతో ఆ సినిమాలు తీస్తారంటే చూసే ధైర్యం ప్రేక్షకులకు లేదు.
సీతయ్య పరిస్థితీ అంతే. ఈ సినిమాలో హరికృష్ణ కథానాయకుడు. మరి ఇప్పుడు ఆ పాత్రని ఎన్టీఆర్ చేస్తాడా?? ఆ అవకాశాలూ లేవు. మరి ఏ ధైర్యంతో చౌదరి ఈ సినిమాల సీక్వెళ్లు ప్రకటించాడు? ఇది కేవలం రేయ్ సినిమాకి హైప్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాల్లానే కనిపిస్తున్నాయి. నిజంగా మొదలెట్టినప్పుడు ఆ సంగతి చూద్దాం.