ఏడాది విరామం తరవాత మళ్లీ మరో సినిమా వదులుతున్నాడు గోపీచంద్. సాహసంతో ఆయన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మొగుడు రూపంలో ఆయనకు కోలుకోని దెబ్బ తగలింది. ఈ ఫ్లాప్ నుంచి తేరుకోవడానికి ఆయనకు ఇంత కాలం పట్టింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన చిత్రం సాహసం. ఇది వరకు వీరిద్దరి కలయికలో ఒక్కడున్నాడు సినిమా వచ్చింది. ఆ సినిమా విమర్శకుల ప్రసంశలు అందుకొంది గానీ.. ఆర్థికంగా నిలబడలేకపోయింది. ఆలోటు ఈ సినిమాతో తీరడం ఖాయం.. అని చిత్రబృందం నమ్ముతోంది.
సాహసం కథ గోపీచంద్ కి నచ్చినా... చందూకి మాత్రం ఎక్కడో చిన్ని పాటి అనుమానం ఉందట. అయినా సరే - గోపీచంద్ బలవంతంమీద ఈ సినిమా ప్రారంభం అయ్యింది. మరి గోపీచంద్ జడ్జిమెంట్ ఈ సినిమాకి ఫలిస్తుందా? నిరీక్షణకు తగిన ప్రతిఫలం దక్కుతుందా? అనేది తేలాలి. బుధవారం ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రంలో చందూ మార్క్ స్పష్టంగా కనిపించింది. మరి సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే.. గోపీచంద్ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే.