పూరీ జగన్నాథ్ కు మెగాదెబ్బ పడింది. ఇద్దరమ్మాయిలతో.. సినిమాకు వస్తున్న ఫ్లాప్ టాక్ ప్రభావం వెంటనే కనిపించింది. టాలీవుడ్ లో ప్రతిభావంతులయిన దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఇటీవల కాలంలో వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నాడు. పైగా సినిమాలను చుట్టేస్తున్నాడు అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘పోకిరి’ వంటి సంచలన చిత్రాలను తీసిన పూరీ ఇటీవల కాలంలో ‘నేను నా రాక్షసి’, ‘దేవుడు చేసిన మనుషులు’ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ వంటి ప్లాపులు సినిమాలు తీసాడు. తాజాగా వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో..’ సినిమా కూడా ఈ చిత్రాల బాటలోనే సాగుతుంది. ఈ చిత్రాల కలెక్షన్ల మాట ఎలా ఉన్నా... దర్శకుడిగా పూరీ జగన్నాథ్ కనీస మార్కులను కూడా సంపాదించలేకపోతున్నాడు. దీంతో పూరీ జగన్నాథ్ కు ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి గట్టి దెబ్బ తగిలింది.

నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ మొదటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం పూరీ జగన్నాథ్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇద్దరమ్మాయిలతో..’ ప్రభావం తో ఆ చాన్స్ పూరీకి మిస్ అయ్యినట్లు తాజా సమాచారం. వరస పరాజయాలతో బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్న పూరీ జగన్నాథ్ కు వరుణ్ తేజ మొదటి సినిమా చాన్స్ ఇవ్వకూడదని మెగా ఫ్యామిలీ భావిస్తున్నట్లు తాజా సమాచారం. ముందుగా అనుకున్నట్లుగానే శ్రీకాంత్ అడ్డాలతో ‘గొల్లభామ’ సినిమాతో వరుణ్ తేజ తొలిసినిమా చేయాలని మెగా వర్గాలు భావిస్తున్నాయి.

దీంతో శ్రీకాంత్ అడ్డాల గోల్డెన్ చాన్స్ కొట్టేశాడని, తప్పిన పోయిన అవకాశం మళ్లీ అతని వద్దేకే వచ్చిందని తెలుస్తుంది. మొత్తానికి ‘ఇద్దరమ్మాయిలతో..’ పరాజయం శ్రీకాంత్ అడ్డాలకు వరంగా మారంది. శ్రీకాంత్ అడ్డాల అదృష్టవంతుడే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: