‘డర్టీ పిక్చర్’ సినిమాను నిర్మించి సంచలనాలు సృష్టించడమే కాకుండా కాసులను పండించుకున్న ప్రముఖ మహిళా నిర్మాత ఏక్తా కపూర్ దృష్టి ప్రస్తుతం క్రికెటర్స్ పై పడింది. ఈమధ్య కాలంలో రాజకీయాల తరువాత స్కాం లు ఎక్కువగా వినిపిస్తున్న రంగం క్రికెట్ ఫీల్డ్. వేలాది కోట్ల రూపాయల వ్యాపారానికి కేంద్రబిందువుగా ఉండడమే కాకుండా వందలాది కోట్ల రూపాయల బెట్టింగ్ లకు వేదికగా నేటి క్రికెట్ క్రీడ మారింది అన్న విషయం తెలిసిందే. ఈ రంగంలో సెలబ్రిటీలుగా వెలుగొందుతున్న ప్రముఖ క్రీడాకారులు క్రికెట్ బెట్టింగ్ మసితో తమ జీవితాలను పణంగా పెడుతున్న సంఘటనలను చూస్తున్నాం.

ఒకప్పుడు మన ఇండియన్ క్రికెట్ కు స్టార్ క్రికెటర్ గా ఒక వెలుగు వెలిగి, అనేక విజయాలు సొంతం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ కు కూడా ఎంతో పేరు తీసుకువచ్చిన క్రికెటర్ అజారుద్దిన్ జీవితాన్ని సినిమాగా తీసే ఉద్దేశంలో ఏక్తా కపూర్ ఉన్నారట. గతంలో సిల్క్ స్మిత జీవితాన్ని సినిమాగా తీసి, సినిమా రంగంలోని చీకటి కోణాలను చూపించిన ఏక్తా, ప్రస్తుతం అజారుద్దిన్ జీవితాన్ని కధావస్తువుగా తీసుకొని క్రికెట్ క్రీడాకారుల జీవితాలలోని చీకటి కోణాలను చూపించబోతున్నారు. ఈ సినిమా చర్చల నిమిత్తం ఇప్పటికే ఏక్త అజార్ ను రెండు మూడు సార్లు కలిసి ఆయన అనుమతి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  నిజజీవితంలోని అజారుద్దిన్ పాత్రను బాలీవుడ్ హీరోలు రణబీర్ కపూర్ కాని లేదా సైఫ్ అలీ ఖాన్ కాని వెండితెరపై పోషిస్తారని తెలుస్తోంది.

సినిమా మసాలా కు అవసరమైన అన్ని సంఘటనలు అజార్ జీవితంలో ఉన్నాయి. క్రికెట్ లో బెట్టింగ్ కు సహకరించాడన్న ఆరోపణలపై అజారుద్దిన్ పై జీవిత కాలపు నిషేధాన్ని విధించడం, భార్య ఉండగానే ప్రముఖ బాలీవుడ్ నటి సంగీత బిజ్ లాని తో ప్రేమ వ్యవహారాలూ నడిపి తరువాత ఆమెను పెళ్ళి చేసుకోవడం, ఆ తరువాత రాజకీయాలలోకి వచ్చి పార్లమెంట్ మెంబర్ గా ఎన్నిక కావడం ఇలా సినిమాకు కావలసిన ఎన్నో మసాలా లు అజార్ జీవితంలో ఉన్నాయి కాబట్టి ఈ సినిమా కూడా ఏక్తా కపూర్ కు మంచి హిట్ ఇస్తుందని బాలీవుడ్ లో టాక్. సినిమా హీరోయిన్ జీవితాన్ని సినిమాగా చూసిన మనం త్వరలో క్రికెటర్ జీవితాన్ని వెండితెరపై చూడబోతున్నాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: