ఏ హీరో అయినా సరే - తన చివరి స్టేజ్లో నిర్మాతగా మారాల్సిందేమో. ఫ్లాపులు వెంటాడుతున్నప్పుడు సొంత బ్యానర్ ఉంటే బాగుంటుంది అనుకోవడం అత్యంత సహజం. ఇప్పుడు రవితేజ కూడా అచ్చం అలాగే ఆలోచిస్తున్నాడట. ఎప్పుడూ నిర్మాతల నుంచి డబ్బు తీసుకోవడం తప్ప... తాను డబ్బులు ఎదురివ్వడం ఎరుగని రవితేజ ఇప్పుడు నిర్మాతగా మారే ప్రయత్నాలు చేస్తున్నాడనేది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.
రవితేజ-పూరి జగన్నాథ్లది క్రేజీ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, నేనింతే సినిమాలలో ఆకట్టుకొన్న కలయిక ఇది. అయితే ఈ పేరంతా... దేవుడు చేసిన మనుషులు సినిమాతో హుష్ కాకి.. అయిపోయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జత కడదామనుకొంటే - నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. అటు రవితేజ, ఇటు పూరి ఫ్లాపుల్లో ఉండడంతో ఈ కాంబినేషన్పై ఇప్పుడు ఎవరికీ ఆసక్తి లేదు.
��
దాంతో రవితేజ రంగంలోకి దిగుతున్నాడు. ఈ సినిమాకి కావల్సిన ఆర్థిక సరంజామా తానే సద్దుబాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. హీరో తనే కాబట్టి.. పారితోషికంతో పనిలేదు. ఇక పూరికి సినిమా పూర్తయ్యాక ఇచ్చినా సమస్య లేదు. దాంతో ఈ సినిమా వర్కవుట్ అయ్యే ఛాన్స్లు ఉండడంతో నిర్మాతగానూ తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడట. మరి అతని జాతకం ఎలా ఉంటుందో చూడాలి.