"దెబ్బకు దెబ్బ" అంటూ సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో పాక్ నటులను భారత్ బహిష్కరించడంతో బాలీవుడ్ సినిమాలను నిషేధించిన పాకిస్థాన్ దిగి వచ్చింది. నాలుగు నెలలు కూడా గడవక ముందే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. బాలీవుడ్ సినిమాలు, లేకపోతే థియేటర్లలో ఈగలు తోలుకోవాల్సి వస్తోందని యజమానులు గగ్గోలు పెట్టడంతో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పంతం వీడింది.
థియేటర్ల యాజమాన్యాల డిమాండ్లు ఏమిటో తెలుసుకోవాలని ఓ కమిటీని నియమించిన నవాజ్ షరీఫ్ బాలీవుడ్ సినిమాల ప్రదర్శనకు అనుమతినిచ్చారు. సమాచార శాఖ మంత్రి మరియుమ్ ఔరంగాజేబ్ నేతృత్వంలో కమిటీ థియేటర్ల కష్టాలపై నివేదిక రూపొందించనుంది. కమిటీకి సంబంధించిన నిబంధనలపై నోటిఫికేషన్లో ఏమీ లేకపోయినా, సవరించిన చట్టం ప్రకారం బాలీవుడ్ సినిమాల దిగుమతిని మాత్రం అనుమతించనున్నారు.
భారతీయ సినిమాల ప్రదర్శనకు కామర్స్ మినిస్ట్రీ "నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్" కూడా జారీ చేసింది. నెలకు రెండు నుంచి మూడు భారతీయ సినిమాలను ప్రదర్శించ వచ్చంటూ కామర్స్ మినిస్ట్రీ స్పష్టంచేసింది. తమ బిజినెస్లో 70 శాతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ద్వారానే వస్తుందని కరాచీలోని "అట్రియం సినిమా" ఓనర్ "నదీమ్ మాండ్వివాలా" చెప్పాడు. తాత్కాలిక నిషేధం వరకు ఓకే గానీ, ఇదే కొనసాగితే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి తప్పదు అని అతడు అన్నాడు.