తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో రికార్డుల మోత మోగించిన చిత్రం ‘బాహుబలి’. తెలుగు తెరపై ఇప్పటి వరకు ఎన్నో జానపద చిత్రాలు వచ్చాయి..కానీ అద్భుతమైన వ్యూజువల్ ఎఫెక్ట్స్ తో అలరించింది. దర్శకధీరుడు రాజమౌళి రెండు సంవత్సరాల సుదీర్ఘంగా కష్టపడి తెరెకెక్కించిన చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు కొల్లగొట్టిన తెలుగు చిత్రం కావడం మరో విశేషం. ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రానికి సీక్వెల్గా ‘బాహుబలి-2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
రాజమౌళి ఈ సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ‘బాహుబలి’లో కంటే ‘బాహుబలి2’ సినిమాలో గ్రాఫిక్స్కు, విజువల్ ఎఫెక్ట్స్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతే కాదు ఈసారి మరో వినూత్న ప్రయత్నం కూడా చేస్తున్నారు. 4కె రిజుల్యూషన్తో కూడిన ప్రొజెక్టర్స్తో సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200ల థియేటర్లు ‘బాహుబలి-2’ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొత్త సొగసులు అద్దుకోనున్నాయి.
మరికొంత మంది 4కె ప్రొజెక్టర్స్ అద్దెకు తెచ్చుకుని ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. థియేటర్ యాజమాన్యాలు ‘బాహుబలి-2’ పై ఇంత నమ్మకం పెట్టుకోవడానికి కారణం లేకపోలేదు. బాహుబలి మొదటి పార్ట్ కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్లో 4కె స్ర్కీన్ పై ప్రదర్శించారు. ఈ ఒక్క థియేటర్లో ఈ టెక్నాలజీ సాయంతో సినిమా ప్రదర్శించడం వల్ల 3.50 కోట్ల రూపాయల లాభం వచ్చిందట. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి రేంజ్ అలాంటది.