బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విజయవంతం అయింది అని వార్తలు ఇప్పటికే వచ్చినా ఈసినిమా దర్శకుడు కాని నిర్మాతలు కాని అధికారికంగా ఈమూవీ కలక్షన్స్ ను ప్రకటించలేదు. దీనితో బాలయ్య అభిమానులకు ఈ విషయమై కొంత అసంతృప్తి ఉంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే సంక్రాంతి రేస్ కు వచ్చిన ఈ మూవీ రన్ రేపటితో 50 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ సినిమా నిర్మాతలు దర్శకుడు క్రిష్ తో కలిసి రేపు ఒక అధికారిక ప్రెస్ మీట్ పెట్టి ఈసినిమా కలక్షన్స్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే బాలకృష్ణ కెరియర్ లో ఎప్పుడూ రాని 50 కోట్ల నెట్ కలక్షన్స్ ఈమూవీకి వచ్చినట్లుగా వార్తలు వచ్చిన నేపధ్యంలో బాలయ్య అభిమానులు ఇప్పటికే మంచి జోష్ మీద ఉన్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు సుమారు 77 కోట్లు కలక్షన్స్ వచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. 

ఈసినిమాకు ఇప్పటి వరకు వచ్చిన కలక్షన్స్ తో పాటు శాటిలైట్ ఆడియో డివిడి డిజిటల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే ఈమూవీ ద్వారా ‘శాతకర్ణి’ నిర్మాతలకు 80 కోట్ల వరకు వచ్చింది అని సమాచారం. ఈ స్థాయిలో బాలకృష్ణ కెరియర్ లో ఇప్పటి వరకు కలక్షన్స్ ఏసినిమాకు రాని నేపధ్యంలో బాలయ్య రేంజ్ ని ‘శాతకర్ణి’ పెంచడమే కాకుండా బాలకృష్ణను 10 కోట్లు పారితోషికం తీసుకునే హీరోగా ఈసినిమా ఘన విజయం మార్చి వేసింది అని అంటున్నారు.

ఇప్పటికే ఈసినిమాకు మన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీ ఇచ్చిన నేపధ్యంలో ‘శాతకర్ణి’ కి వచ్చిన కలక్షన్స్ లెక్కలోకి తీసుకుంటే ఈమూవీ నిర్మాతలకు అద్భుతమైన లాభాలు వచ్చాయి అనుకోవాలి.  అయితే ఇంతటి అద్భుతవిజయం సాధించిన తరువాత బాలకృష్ణ పూరి దర్శకత్వంలో ఒక సాదా సీదా మాస్ మసాలా సినిమాలో నటించడం బాలయ్య అభిమానులకే కాకుండా చాలామందికి అర్ధంకాని ప్రశ్నగా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: