పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ ని గోపీచంద్ ‘సాహసం’ భయపెడుతుందా..? ఈ రెండిటికీ సంబంధం ఏమిటి అనుకుంటున్నారా..? అయితే ఈ వార్త చదవండి. గోపీచంద్ హీరోగా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన ‘సాహసం’ విడుదలకు నానాప్రయాస పడుతోంది. గోపీచంద్ కెరియర్ లోనే బిగ్ బడ్జెట్ సినిమాగా రూపొందిన సాహసం జూన్ లోనే విడుదల కావలసి ఉంది. కాని రకరకాల కారణాలతో ఈ సినిమా ఇప్పుడు జూలై 12కు మారింది అంటున్నారు.

సాహసం సినిమా జూలై 12 న విడుదల ఖాయమని నిర్మాత చెపుతున్నా, ఖచ్చితంగా విడుదల అవుతుంది అనే చెప్పలేని పరిస్థితి ఈ సినిమాకు ఉంది. దీనికి కారణం భారీ బడ్జెట్ సినిమాకు అనుకున్న రీతిలో మార్కెట్ కాకపోవడమే అంటున్నారు. ఒక ఫెయిల్యూర్ హీరో, మరో ఫెయిల్యూర్ హీరోయిన్, ప్రస్తుతం అంతగా హిట్స్ లేని దర్శకుడు చేసిన సాహసం గానే ఈ సాహసం సినిమాని చూస్తున్నారట. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన బివిఎస్ఎన్ ప్రసాద్, పవర్ స్టార్ ‘ఆత్తారింటికి దారేది’ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఒకేసారి రెండు బడా సినిమాలను నెత్తిన పెట్టుకోవడంతో ఈ నిర్మాత ఆర్ధికంగా నలిగిపోతున్నాడని టాలీవుడ్ టాక్. అందువల్ల గోపీచంద్ సాహసం విడుదల లో ఏదైనా తేడా జరిగితే దాని ప్రభావం పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాపై ఉంటుందా..? అనే ఆశక్తికర చర్చ ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతుంది.

కాని పవన్ కళ్యాణ్ సినిమా ‘అత్తారింటికి దారేది’ మార్కెట్ చాలా బాగా జరిగిపొయింది కాబట్టి, గోపీచంద్ సాహసం సినిమాలో ఏమైనా తేడాలు వచ్చినా ఆ సినిమా ప్రభావం పవన్ సినిమాపై ఉండే అవకాశం లేదు అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. కాని ఈ వార్తలు వింటున్న పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఖంగారు పడుతున్నారట.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: