ఒక్క వారంలో విడుదలవనున్న "బాహుబలి -2 ది కంక్లూజన్" సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు పెరుగటమే కాదు దినదిన ప్రవర్ధమాన మౌతున్నాయి. ఏప్రిల్ 28 నేడే ఐతే బాగుణ్ణు అనేంతగా ప్రెక్షకులు ఎదురు చూస్తున్నారు. అభిమానులు, సాధారణ ప్రేక్షకులు అనే భేదమే ఎక్కడా కనిపించని అద్భుతమైన క్షణాలివి. ప్రధాని నరెంద్ర మోడీ నుండి అతి సాధారణ మైన ప్రేక్షకుడు "అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే" పెద్ద హైపున్న ప్రశ్నకు సమాధానం ఎంత బలవత్తరంగా ఉంటుందో నని ఎదురు చూస్తూ రెండేళ్ళు గడిపిన వారికి ఆ తెలుసుకునే మధుర క్షణాలు దగ్గర పడుతున్నకొద్దీ క్షణాలు మరింత ఆత్రుత కలిగిస్తున్నాయి.
బాహుబలి.. బాహుబలి.. ఇప్పుడిదే మాట ప్రపంచ సినీ అభిమానులంతా పలుకుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదలవబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే నేషనల్ మీడియాలో బాహుబలి టీం ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తుండగా, మరి కొద్ది రోజుల్లో దుబాయికి కూడా వెళ్లనుంది చిత్రబృందం. ఇదిలా ఉండగా సినిమాపై ఓ సినీ విశ్లేషకుడు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. యూఏ ఈ సెన్సార్ బోర్డ్ సభ్యుడు, యూఏఈ, యూకే, ఇండియా సినీ విశ్లేషకుడు అయిన "ఉమైర్ సంధు". ఏప్రిల్ 17న చేసిన ట్వీట్ బాహుబలి-2 సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
"బాహుబలి-1 కంటే బాహుబలి-2 సినిమా వందరెట్లు బాగుంటుందని" ఉమైర్ సందు తేల్చిచెప్పారు. సినిమా ఫలితంపై సినీ వర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని ట్వీట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు, ప్రభాస్ అభిమానులు సంబ రాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చెబుతున్నారు. ఉమైర్ సంధు చెప్పిన మాటలే కనుక నిజమైతే.. బాహుబలి గురించి, తెలుగోడి సత్తా గురించి ప్రపంచం మాట్లాడుకోవడం ఖాయం.