ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో దర్శక, నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడంలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఎంత భారీ బడ్జెట్ సినిమా అయితే అంత గొప్ప పేరు వస్తుందన్న ట్రెండ్ మొదలైంది. ఇక తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యం మహా ఇతిహాసం మహా భారతం చిత్రాన్ని దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎంటీ వాసుదేవన్ నాయర్ రచించిన రందమూళమ్ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది.
ప్రముఖ పారిశ్రామిక వేత్త బీఆర్ శెట్టి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహాభారత్ ప్రాజెక్టును వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో నిర్మించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లోనే కాకుండా వేరే భాషలలోను ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అంతా బాగుంది కానీ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పై వివాదం నెలకొంది. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం టైటిల్ ని మహాభారతం అని వ్యవహరించే బదులు రచయిత ఎం. టీ.వాసుదేవన్ నాయర్ రచించిన ‘రందమూజం’ పుస్తక టైటిల్ నే పెట్టాలని కేరళ హిందూ ఐక్య వేదిక అధ్యక్షురాలు కె.పి. శశికళ డిమాండ్ చేస్తున్నారు.
వ్యాస మహర్షి రాసిన మహాభారతమే అందుకు తగినదని,ఏ చిత్రాన్నీ ఈ పేరుతో తీయరాదని అంటున్న ఆమె..రందమూజం టైటిల్ నే ఖరారు చేయాలని, లేకపోతే కేరళలో ఈ సినిమాను ప్రదర్శించనివ్వబోమని హెచ్చరించారు. నవల ఆధారంగా రూపొందనున్న సినిమాకి, వేద వ్యాసుడు రాసిన మహా భారతం పేరు ఎలా పెడతారు అంటూ సంఘం అధ్యక్షురాలు కె.పి.శశికళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ కుమార్ మీనన్ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది సెప్టెంబరులో అబూధాబిలో ప్రారంభమవుతుంది. 2020 సంవత్సరం కల్లా షూటింగ్ ముగుస్తుందని, ఇండియాతో బాటు కొన్ని ఇతర దేశాల్లో షూటింగ్ జరుపుతామని మేకర్స్ తెలిపారు. అంతే కాదు మహా భారతం చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.