ఈ మద్య మానవత్వపు విలువలు మంట కలిసిపోతున్నాయి అనడానికి ఎన్నో సంఘటనలు మన కళ్లముందే జరుగుతున్నాయి. ఓ కవి అన్నట్లు ‘మాయమై పోతున్నడమ్మా..మనిషన్నవాడు..మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు’ అన్న చందంగా డబ్బు కి ఇచ్చిన విలువ కన్న తల్లిదండ్రులకు కూడా ఇవ్వకుండా పోయారు. ఒకప్పుడు ఆమె సినిమా నటి..బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది కానీ నేడు ఆమె పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది. బాలీవుడ్ ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం ‘పాకీజా’ లాంటి సినిమాలో నటించిన నటి గీతా కపూర్, ఇప్పుడు ఓ ఆసుపత్రిలో అనాధలా మిగిలారు.
ఏప్రిల్ 21న ఆమె రక్తపోటుతో బాధపడుతుండగా, స్వయంగా ఆసుపత్రికి తీసుకువచ్చిన ఆమె కుమారుడు రాజా కపూర్. ఏటీఎం లో డబ్బు తీసుకు వస్తానని చెప్పిన వాడు ఇప్పటికీ పత్తా లేకుండా పోయాడు. దీంతో పరిస్థితి అర్ధం చేసుకున్న గీతా కపూర్ కన్నీటి పర్యంతం అయ్యారు. వృద్ధాప్యంలో ఉన్న ఆమెను కొడుకు ఆస్పత్రిలో నిస్సహాయస్థితిలో వదిలేసి వెళ్లిపోవడం అందరి హృదయాలు కలచి వేసింది.
మిడ్-డే కథనం ప్రకారం గీతాకపూర్ కొడుకు రాజా ఆమెను గత నెల ముంబై గోరేగావ్లోని ఎస్వీఆర్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రిలో కట్టేందుకు ఏటీఎం నుంచి డబ్బు తీసుకొస్తానంటూ చెప్పి వెళ్లిపోయిన అతను ఆ తర్వాత తిరిగి రాలేదు. అప్పటి నుంచి ఆమె ఆస్పత్రిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఇక కొడుకు తనపై ఎంతో నిర్దయగా ప్రవర్తిస్తుండే వాడని, ఓ గదిలో బంధించి, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవాడని ఆమె ఆరోపించారు.
కాగా, ఆమెను బయటకు పంపలేని స్థితిలో ఉన్న ఆసుపత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గీత కుటుంబ సభ్యుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. గీత కుమార్తె పూజకు పోలీసులు ఫోన్ చేయగా, ఆమె రాంగ్ నంబర్ అంటూ ఫోన్ పెట్టేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. గీతాకపూర్ కొడుకుపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.