తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే మెగా కుర్రోడు అంటే ఇలా ఉండాలీ అని దేశముదురు, ఆర్య, బన్ని చిత్రాలతో నిరూపించాడు. డ్యాన్స్, ఫైట్స్ లో తనకంటూ ప్రత్యేక స్టైల్ చూపించాడు కనుకనే..ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. గత సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బన్నీ తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో నటించాడు.
ఈ చిత్రం 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే దువ్వాడ జగన్నాథం సెన్సారు కూడా పూర్తకావడంతో సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నట్లు చెబుతున్నారు చిత్ర యూనిట్. అందుకే అల్లు అర్జున్ సతీ సమేతంగా సోమవారం రాత్రి ప్రత్యేకంగా ప్రసాద్ ల్యాబ్ లో డిజె షో వేసుకున్నారు. బన్నీతో పాటు ఆయన సతీమణి స్నేహా రెడ్డి, నిర్మాత దిల్ రాజు, శిరీష్, వారి కుటుంబ సభ్యులు కలిసి చూశారట.
ఇక ఈ సినిమా చూసి బన్నీ వైఫ్ స్నేహా రెడ్డి అవుట్ అండ్ అవుట్ ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాదు అల్లు అర్జున్ చేసిన కామెడీకి కుటుంబ సభ్యులు పడీ పడీ నవ్వారట. అలాగే సీటీ మార్ పాటను ఫుల్ గా ఎంజాయ్ చేసారని వినికిడి. సినిమాను వీక్షించిన తర్వాత నిర్మాత దిల్ రాజు..అల్లు అర్జున్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మా సంస్థకు అద్భుతమైన చిత్రాన్ని అందించావు అని తెగ పొగిడేశాడట.