ఈ మద్య బుల్లి తెరపై వస్తున్న సీరియల్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ గా సాగుతుంటే..మరికొన్ని పరమ చెత్తగా, బోర్ గా ఉంటున్నాయి. ఒకప్పటి సీరియల్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి. అంతే కాదు ఇందులో నటీమణులు కూడా కాస్త గ్లామర్ జోరు పెంచుతున్నారు.. ఎందుకంటే సీరియల్స్ లో సక్సెస్ అయితే సినిమా చాన్సులు వస్తాయన్న ఆశ వారిలో ఉంటుంది.
ఇలా బుల్లితెరపై వచ్చిన వారు అదృష్టం కొద్ది వెండితెరపై కూడా వెలిగిపోయారు. తాజాగా హిందీలో ప్రసారం అవుతున్న ఓ సీరియల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బ్యాన్ చేయాలంటూ ఏకంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీకే విజ్ఞప్తి చేస్తున్నారు. అంతే కాదు ఈ సీరియల్ బ్యాన్ చేయాలని ఆన్ లైన్ ఉద్యమం కొనసాగుతుంది.
వివరాల్లోకి వెళితే.. సోనీ టీవీలో ప్రైప్ టైంలో పెహ్రేదార్ పియా కీ (pehredaar piya ki) అనే సీరియల్ ప్రసారం అవుతుంది. ఇందులో ఓ పదేళ్ల పిల్లోడిని.. 20 ఏళ్ల యువతి పెళ్లి చేసుకుంటుంది. నుదుటిపై కుంకుమ దిద్దుతాడు. ఇద్దరి మధ్య భార్య, భర్తల సన్నివేశాలు కూడా ఉంటాయి. ఇంకాస్త ముందుకు వెళ్లి వారం క్రితం ప్రసారం అయిన ఎపిసోడ్ లో పదేళ్ల పిల్లోడి శోభనం గదిలోని అల్లరిని కూడా చూపించేశారు. హనీమూన్ డిస్కసన్ తో డైలాగ్స్ పేల్చారు.
దీంతో మరింత చిర్రెత్తిపోయిన ప్రేక్షకులు.. సీరియల్ బ్యాన్ కోసం ఉద్యమం లేవనెత్తారు. ఛేంజ్.ఓఆర్జీ పేరిట మాన్సి జైన్ ఆన్లైన్ లో సంతకాల సేకరణ చేపట్టారు. ఇప్పటికే ఈ పిటిషన్పై 42,000 మంది సంతకాలు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.ఓ సీరియల్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరగటం బహుశా దేశంలో ఇదే కావొచ్చు.