నిన్న సాయంత్రం ఖమ్మంలో ‘పైసా వసూల్’ ఆడియో ఫంక్షన్ అత్యంత కోలాహలంగా జరిగింది. కురుస్తున్న వానను కూడ లెక్క చేయకుండా ఆ ఫంక్షన్ కు వచ్చిన వేలాదిమంది అభిమానులను చూసి నందమూరి బాలకృష్ణ జోష్ లోకి వెళ్ళిపోయాడు.

ఈ సందర్భంగా బాలయ్యను ఆకాశంలోకి ఎత్తేద్దామని ప్రయత్నిస్తూ పూరి పొగడ్తలతో కూడిన సెటైర్లను చాలామంది ఎంజాయ్ చేసారు. బాలకృష్ణ తన అభిమానుల్ని కొడితే అదొక లవ్‌ స్టోరీ అంటూ ఒక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు పూరి. అంతేకాదు తాను బాలయ్యతో ఈసినిమాను తీయకుండా ఉండి ఉంటే తనకు బాలకృష్ణ గొప్పతనం తెలిసేది కాదని బాలయ్య పై విపరీతమైన ప్రశంసలు కురిపించాడు పూరి.

ఇదే సందర్భంలో పూరి మాట్లాడుతూ 'ఏ హీరోకి అయినా బౌన్సర్లు కావాలి, బాలయ్యకు ఆ బౌన్సర్లు అవసరం లేదు, ఎందుకంటే అభిమానుల్ని బాలయ్యే కంట్రోల్‌ చేస్తారు' అంటూ బాలయ్య నంద్యాలలో తన అభిమాని పై అసహనాన్ని వ్యక్తపరిచిన సంఘటన పై వచ్చిన విమర్శల పై అన్యాపదేశంగా క్లారిటీ ఇచ్చాడు. బాలకృష్ణ తనతో మాట్లాడేడప్పుడు తన తండ్రి గురించి సినిమా గురించి మాత్రమే ఎప్పుడూ మాట్లాడే కల్మషం లేని వ్యక్తిత్వం బాలయ్య సొంతం అంటూ కామెంట్ చేసాడు పూరి.
 

అంతేకాదు బాలయ్య నిరంతరం హిందూపురం అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని పూరి కామెంట్ చేసినప్పుడు హిందూపురం నియోజకవర్గంలో ప్రజలు తమకు తాగడానికి నీళ్ళు లేవంటూ బిందెలు పట్టుకుని, బాలయ్యని నిలదీసేందుకు ప్రయత్నించిన విషయాన్ని పూరి మర్చిపోయాడా అంటూ కొందరు కామెంట్ చేసుకున్నట్లు టాక్. ఏది ఏమైనా అటు పూరి ఇటు బాలకృష్ణలు ఈమధ్యలో రకరకాల వివాదాలలోకి చిక్కుకున్నా అవేమీ తమకు సంబంధం లేదు అన్నట్లుగా విపరీతమైన జోష్ తో నిన్న జరిగిన ‘పైసా వసూల్ ఆడియో ఫంక్షన్ లో హడావిడి చేసారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: