తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో చిత్రాలు తెరకెక్కించిన దర్శకధీరుడు రాజమౌళి. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాలతో ఏకంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిపోయారు. ఇప్పటి వరకు ఏ రికార్డులు ఉన్నా అది బాలీవుడ్, కోలీవుడ్ కే సొంతంగా ఉండేవి. కానీ బాహుబలి సీరిస్ తర్వాత ఆ రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోయాయి. అంతే కాదు బాహుబలి సీరీస్ తో ప్రభాస్, రానా, అనుష్క, రాజమౌళి జాతీయస్థాయిలో పాపులారిటీ సంపాదించారు.
బాహుబలి 2 చిత్రం తర్వాత ఇందులో నటులు అంతా బిజీగా మారిపోయారు. ప్రభాస్ ‘సాహు’ చిత్రంలో నటిస్తున్నారు..అనుష్క రెండు ప్రాజెక్టులు ఒప్పుకొని..షూటింగ్ బిజీలో ఉంది. ఇక రానా ఇప్పటికే ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విజయాన్ని అందుకున్న సంతోషంలో ఉన్నాడు. కాకపోతే ఇప్పటి వరకు జక్కన్న మాత్రం తన తర్వాత చిత్రం గురించి ఎలాంటి వివరాలు మీడియాకు తెలపలేదు.
కుదిరితే సూపర్స్టార్ మహేశ్బాబుతో కలిసి సినిమా చేస్తానని ఆయన ఇంతకుముందు ఓ సందర్భంలో చెప్పారు. అయితే దీని కంటే ముందు మరో సినిమాకు రంగం సిద్ధం చేశారు రాజమౌళి. ఈ మద్య ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు ఆయన తెలిపారు.
గతంతో ఆయనతో సినిమా తీస్తానని మాట ఇచ్చానని అందుకే..డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యంలో సోషల్ డ్రామా నేపథ్యంలో సదరు సినిమాను రూపొందిస్తున్నట్లు జక్కన్న చెప్పారు. అయితే ఈ సినిమాలో నటీనటులెవరు.., ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తారు తదితర విషయాలపై ఇంకా ఏమీ అనుకోలేదట. మొత్తానికి తన తదుపరి చిత్రంపై మాత్రం క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.