బాలీవుడ్ లో ఏ ముహూర్తంలో సంజయ్ లీలా బన్సాలి చారిత్రాత్మక చిత్రం ‘పద్మావతి’ మొదలు పెట్టారు అప్పటి నుంచి అన్నీ అవాంతరాలే ఎదురవుతున్నాయి. ఎన్నో వివాదాల చుట్టూ తిరుగుతోన్న ‘పద్మావతి’ని వచ్చే నెల 1న విడుదల చేయాలని చూస్తోన్న విషయం తెలిసిందే. మరోపక్క, ఈ సినిమాను విడుదల చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు వస్తున్నాయి. అంతే కాకుండా సినిమా విడుదలను కూడా అడ్డుకుంటామని చెబుతున్నారు.
పద్మావతి పాత్రలో నటించిన దీపికా పదుకొనె ముక్కును కూడా కోసేస్తమని చెబుతున్నారు. అంతే కాదు ఇంకాస్త ముందుకెళ్లి ఈ సినిమాలో నటించిన దీపికా పదుకునేను చంపితే రూ.5 కోట్లు ఇస్తామని కర్ణిసేన సంస్థ ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. థియేటర్స్ లో సినిమా ఆడితే తగలబెట్టేస్తామని కూడా ఇప్పటికే కొందరు వార్నింగ్ ఇచ్చారు.
ఇక యూపీ ప్రభుత్వం కూడా పద్మావతి సినిమా ఈ సమయంలో రిలీజ్ అవ్వడం అంత మంచిది కాదని కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ తీసిన ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ చిత్రం విడుదలను ఆపకపోతే.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఆదిత్యనాథ్ కేంద్రానికి తెలిపారు.
ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సెన్సార్ బోర్డు వ్యహరించాలని యూపీ ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా.. పద్మావతి చిత్ర వివాదంపై జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది.