‘జై లవ కుశ’ సినిమాతో తాను కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న దర్శకుడు బాబి తన కెరియర్ ప్రారంభంతోనే టాప్ హీరోలు పవన్ కళ్యాణ్ రవితేజలతో సినిమాలు తీసి ప్రస్తుతం టాలీవుడ్ బిగ్ డైరెక్టర్స్ లిస్టులో స్థానం సంపాదించుకున్నాడు. మంచి మాటల రచయిత కూడ అయిన కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబి మెగా స్టార్ చిరంజీవికి వీరాభిమాని. ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబి తన ఇంటికి ఈమధ్య మెగా స్టార్ చిరంజీవి వచ్చి తన ఇంటిలో దాదాపు రెండు గంటలపాటు సమయం గడిపిన ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 

తన తండ్రి కూడ చిరంజీవి వీరాభిమాని అని చెపుతూ తన చిన్నప్పుడు తన తండ్రి తనను చిరంజీవి సినిమాలకు లెక్కలేనన్ని సార్లు తీసుకు వెళ్ళడంతో తనకు చిరంజీవి పై అభిమానం ఏర్పడిన విషయాన్ని తెలియచేసాడు. అయితే ప్రస్తుతం తాను ప్రముఖ దర్శకుడుగా మారిన నేపధ్యంలో తన తండ్రి తన వద్ద ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఈమధ్య అనారోగ్యంతో ఉన్న తన తండ్రి తనను కోరిన కోరికను బయటపెట్టాడు. 

‘నీకు చిరంజీవి సినిమాలు అన్ని చూపించాను కదా. నువ్వు నాకు చిరంజీవిని నేరుగా చూపించవా’ అని అంటూ అడిగినట్లు చెపుతున్నాడు బాబి. అయితే తాను దర్శకుడుగా ప్రముఖ స్థానంలో ఉన్నప్పటికీ తన తండ్రి కోరిక తీర్చే విషయంలో కొంత సున్నితమైన మొహమాటం అడ్డు రావడంతో తనకు ఆప్తుడైన దర్శకుడు వి.వి.వినాయక్‌‌కు ఫోన్ చేసి చిరంజీవిని కలిసే ఏర్పాటు చేయమని అడిగినట్లు చెప్పాడు బాబీ. 

అయితే తర్వాత వినాయక్ ఫోన్ చేసి చిరంజీవే తమ ఇంటికి వస్తున్నట్లు చెప్పాడని అలా వద్దని తానే వెళ్లి కలుస్తానని చెప్పినా వినలేదని ఈమధ్య  ‘జై లవకుశ’ సినిమా విడుదలరోజు చిరంజీవి స్వయంగా తన ఇంటికి వచ్చి రెండు గంటల పాటు తమ ఇంట్లో తన తండ్రితో గడిపి వెళ్ళాడు అన్న నిజాన్ని బయట పెట్టాడు బాబి. అయితే అదృష్టవశాత్తు చిరంజీవి తన ఇంటికి వచ్చి వెళ్ళిన తరువాత తన తండ్రి ఆరోగ్యం బాగా బాగుపడింది అని చెపుతున్న బాబి మాటలుబట్టి చిరంజీవి మాటల వైద్యం బాబి తండ్రి పై బాగా పనిచేసింది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: