మన ఈ యాంత్రిక జీవితంలో స్నేహితులతో అప్పుడప్పుడు గడపటం చిన్న ఉత్సాహం.. చిన్న రీచ్చార్జ్.. మనం పాత స్నేహితుల్ని మర్చిపోకుండా వారితో అప్పుడప్పుడైనా కలిస్తే ఎన్నో తీపి కబుర్లు నెమరేసుకోవొచ్చు. అయితే సినిమా రంగంలో కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇతర భాషల హీరోలు, హీరోయిన్లు కలుస్తూ ఉంటారు. గత కొంత కాలంగా 1980వ దశకంలో వెండితెరని ఏలిన సినీ తారలంతా ఒక చోట కలుసుకొన్నారు.
ప్రముఖ నటి సుహాసిని చొరవతో ఏర్పడిన ఈ యూనియన్ సభ్యులు అప్పటి నుంచీ ప్రతి ఏడాదీ తారలంతా కలిసి తమ స్నేహబంధాన్ని చాటుకుంటున్నారు. ఈసారి మహాబలిపురం దగ్గర సముద్రతీరంలోని ఓ రిసార్ట్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తారలు 28 మంది కలుసుకొన్నారు. అలా కలుసుకోవడం ఇది 8వసారి.
ముదురు ఉదా రంగు విద్యుత్ దీపాలతో అలంకరించిన రిసార్ట్లో, అదే రంగు దుస్తుల్ని ధరించి రెండు రోజులపాటు ఆటపాటలతో సరదా సరదాగా గడిపారు తారలు. చిరంజీవి, వెంకటేష్, శరత్కుమార్, నరేష్, సురేష్, జాకీష్రాఫ్, భానుచందర్, రమ్యకృష్ణ, సుహాసిని, సుమలత, జయసుధ, లిజీ, ఖుష్బూ, రేవతి, శోభన, రాజ్కుమార్ సేతుపతి, పూర్ణిమ భరద్వాజ్ తదితర తారలు ఈ కలయికలో పాల్గొన్నవాళ్లలో ఉన్నారు.