తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి సిరీస్ క్రియేట్ చేసిన అద్భుతం అంతా ఇంతా కాదు. దర్శకధీరుడు రాజమౌళి ఐదు సంవత్సరాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఈ సినిమాలో నటించిన నటులకు కూడా అదే స్థాయిలో క్రెడిట్ దక్కింది. బాహుబలి గా నటించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ స్థాయిలో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే ఇప్పుడు తన తదుపరి చిత్రాలకు కూడా అదే స్థాయిలో ఇమేజ్ కాపాడుకోవాలని చూస్తున్నాడు.
రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘సాహూ’ చిత్రంపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. అంతే కాదు ఈ చిత్రం నేషనల్ వైడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు ప్రభాస్. ఈ మూవీలో ప్రభాస్కి జోడిగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాహూ చిత్రంలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించబోతున్నాడట.
ఆ రెండు పాత్రలు కూడా ఇంత వరకు ఎప్పుడూ చేయని విధంగా ఉండేట్టు డిజైన్ చేసారని వినికిడి. ఇప్పటికే బాహుబలి లాంటి సినిమాలో రెండు పాత్రల్లో కనిపించిన ప్రభాస్ ఈ సారి ఏ మంత్రం వేస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రం మూడో షెడ్యూల్ జరుగుతోంది. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది తెరపైకి రానుంది.