అనుకొన్నట్టుగానే అత్తారింటికి దారేది సినిమా విడుదల తేదీ మారిపోయింది. 7న రావాల్సిన సినిమా 9న విడుదలవ్వబోతోంది. శుక్రవారం హైదరాబాద్లో సెన్సార్ కార్యక్రమాలు జరిగాయి. సినిమాకి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. నిర్మాణానంతర కార్యక్రమాలకు మరికొంత సమయం పడుతుందో ఏమిటో తెలియదు కానీ... సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చాక రెండు రోజులు సినిమా వాయిదా పడింది.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రమిది. సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. బి.వి.యస్.యన్. ప్రసాద్ నిర్మాత. తెలంగాణ గొడవల నేపథ్యంలో సినిమాని వాయిదా వేయొచ్చనే ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు నిర్మాత ధైర్యంగా ఈ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకొన్నారు.
రాష్ట్రంలో ఎన్ని గొడవలు ఉన్నా... పవన్ మేనియా ముందు అన్నీ చిన్నబోతాయని నిర్మాత గట్టిగా నమ్ముతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నారు. త్రివిక్రమ్ కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి ఈ సినిమాని తీశారు. ఆయన రాసిన సంభాషణల గురించి ఇప్పటికే జనం మాట్లాడుకొంటున్నారు.