తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాత,దర్శకుడిగా ఎన్నో విప్లవ సినిమాలు తెరకెక్కించిన ఆర్ నారాయణమూర్తి ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడుతారు. కొన్ని సార్లు ఈయన వ్యాఖ్యలు పెను సంచలనాలకు దారితీసినా..అందులో నిజాయితీ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ మద్య కాస్త సినిమాలు తగ్గించిన నారాయణ మూర్తి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎక్కడ ఉన్నా తెలుగు మాట్లాడేవారంతా అన్నదమ్ములేనని తెలుగు భాషకు ప్రాంతీయ, మత భేదాలు లేవని, అమ్మ భాషను ఆదరించాలని, దీంతోపాటు పరభాషలపై పట్టు సాధించాలని అన్నారు.
రాష్ట్రాలు రెండు అయినా మనమంతా తెలుగు బిడ్డలం అన్నారు. ఇక్కడ కొంత మంది రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అని విభిజించడం తనకెంతో బాధ అనిపిస్తుందని అన్నారు. మొన్నటి వరకు కలిసిమెలిసి ఉన్నవాళ్లం..రాష్ట్రాలు విడిపోతే దూరమైతామా అన్నారు. తనను తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
కాగా, ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం మంచిర్యాల జిల్లాలో నిన్న జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.