భారతీయ సాంప్రదాయంలోని అనేక పూజలు లాగే పరమశివుడి ‘మహాశివరాత్రి’ కూడ దేవి తత్వానికి సంబంధించినది. సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున "శివరాత్రి" వస్తూనే ఉంటుంది. దీనిని "మాసశివరాత్రి" అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే "మహాశివరాత్రి" పర్వదినం చాలా విశిష్టమైనదని పండితులు అంటున్నారు.  ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి ఆడుగుతుందట. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ ఆరోజు ఇంకేమి చేయకుండా ఒక్క ఉపవాసమున్నాసరే తనెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం శివరాత్రి రోజు పగలంతా నియమ నిష్ఠతో ఉపవాసంతో గడిపి, రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుందని అంటారు.  మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ, ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి ప్రీతి. "మహాశివరాత్రి" పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి, శుచిగా తలస్నానం చేసి, పూజా మందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలను ధరించి, శివుని పటాలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి, పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. పూజా సమయంలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా.. నిష్ఠతో ఉపవాసముండి శివసహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను, మనము అనుకోకుండా సమాజం అంతా క్షేమంగా ఉండాలి అని కోరుకున్న వారికే మహాశివుడి ఆశిస్సులు లభిస్తాయని అంటారు. తెలుగు వారందరికీ ‘మహా శివరాత్రి’ శుభాకాంక్షలు ! 

మరింత సమాచారం తెలుసుకోండి: