కొన్ని సంవత్సరాల క్రితం లేడీ అమితాబ్ గా టాలీవుడ్ ను షేక్ చేసి అలనాటి టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన విజయశాంతి కెరియర్ మరొకసారి టాలీవుడ్ లో తిరిగి ప్రారంభం కాబోతోంది అనే వార్తలు వస్తున్నాయి.

గతంలో చిరంజీవితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నటిస్తున్నప్పుడు తనకు చిరంజీవితో సమానంగా పారితోషికం కావాలని డిమాండ్ చేసినట్లుగా విజయశాంతి పై అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తరువాత యంగ్ హీరోయిన్స్ హవా ప్రారంభం కావడంతో విజయశాంతి తెలంగాణ వాదాన్ని అందిపుచ్చుకుని రాజకీయాలలోకి వెళ్ళి పోయింది.

అయితే రాజకీయాలలో కూడా అనుకున్న స్థాయిలో విజయశాంతి రాణించక పోవడంతో తిరిగి ఆమె యూటర్న్ తీసుకుని టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గోపీచంద్, బి. గోపాల్ ల కాంబినేషన్ లో ఎప్పుడో మొదలై మధ్యలో ఆగిపోయి ఇప్పుడు స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలో విజయశాంతి కోసం దర్శకుడు గోపాల్ ఒక ప్రత్యేక పాత్రను క్రియేట్ చేసాడట.

ఈమధ్యనే దర్శకుడు గోపాల్ విజయశాంతిని కలిసి ఈ పాత్రకు సంబంధించిన వివరాలను చెపితే ఒకనాటి రాములమ్మ తిరిగి నటించడానికి ఒప్పుకుంది అని ఫిలింనగర్ టాక్. ఇప్పటికే శ్రీదేవి, నదియా, రమ్యకృష్ణ లాంటి ఒకనాటి గ్లామర్ హీరోయిన్స్ భారీ పారితోషికాలు అందుకుంటూ తిరిగి సినిమాలలో నటిస్తున్న నేపధ్యంలో దర్శకుడు గోపాల్ విజయశాంతితో చేయబోతున్న ప్రయోగం విజయవంతం అయితే తిరిగి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయినట్లే అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: