నందమూరి సిoహానికి కోపం వచ్చింది. ఒక వైపు పవన్ రాజకీయంగా వేగం పెంచుతూ ఉంటే తానేమి తక్కువకాను అంటూ బాలయ్య తన రాజకీయ ఉగ్రరూపాన్ని ఈరోజు మీడియా ముందు బయట పెట్టాడు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందంటూ బాలకృష్ణ ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చాడు.

ఇలాగైతే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని అంటూ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ కూటమికి ఓటు వేసినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బాద పడే పరిస్థితిని బీజేపీ తీసుకొస్తోందని షాకింగ్ కామెంట్ చేసాడు. అంతేకాదు 100 కోట్లు ముష్టి వేసి పోలవరం ప్రాజెక్టు కట్టేసుకోమంటే ఎలా అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు బాలయ్య.

తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బ తీయాలని చూడొద్దు, ప్రజలు తిరగబడ్తారు అని అంటూ బిజెపికి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఒకనాటి తన తండ్రి నందమూరి తారకరామారావు తెలుగువారి ఆత్మ గౌరవం టాపిక్ ను మళ్ళీ తెరపైకి తీసుకు వచ్చాడు బాలయ్య. ప్రత్యేక హోదాపై వేరే రాష్ట్రాలకు లేని అభ్యంతరం ఆంధ్రప్రదేశ్‌కే ఎందుకు వస్తుందని బాలకృష్ణ బీజేపీ పై ఆగ్రహన్ని వ్యక్త పరిచాడు.

అయితే ఒకవైపు బాలయ్య మరొక వైపు పవన్ తమ రాజకీయ అస్త్రాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నా ఇప్పట్లో ఏ ఎన్నికలు లేకపోవడంతో వీరి కోపం ఆవేశం మీడియా కెమెరాలకు మాత్రమే పరిమితం అయ్యేట్లుగా కనిపిస్తోంది. ఇంతకీ నందమూరి సింహం గర్జనలు ఢిల్లీ దాకా చేరుతాయో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: