నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గతంలో జూనియర్ తో ‘ఊసరవిల్లి’ సినిమాను భారీగా నష్టపోయిన నేపధ్యంలో అప్పట్లో ఆ నష్టాలను తీర్చడానికి జూనియర్ మరో సినిమాను చేస్తానని మాట ఇచ్చాడు అనే వార్తలు గతంలో వచ్చాయి. అయితే ఆ నష్టాలను జూనియర్ తీర్చలేక పోయినా పవన్ తన ‘అత్తారింటికి దారేది’ ద్వారా ఆ నష్టాలను అన్నిటిని నిర్మాత ప్రసాద్ కు తీర్చిన విషయం తెలిసిందే. 

అయితే అనేక ట్విస్టులు తర్వాత జూనియర్ తిరిగి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు సుకుమార్ దర్శకత్వంలో లేటెస్ట్ గా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.  కేవలం పూజా కార్యక్రమం వరకు జరిగి ఇంక షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులకు ఒక వైపు జూనియర్, మరొక వైపు సుకుమార్ చేస్తున్న దుబారా  ఖర్చులు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

ఈ సినిమా కోసం జూనియర్ తన  స్టైలిష్ ఎడ్వైజర్ తో కలిసి  చైనా, హాంకాంగ్ దేశాలకు ఈ సినిమాలో తాను వేసుకోవలసిన కాస్ట్యూమ్స్ సెలక్షన్ కోసం విదేశాల బాట పడితే ఈ సినిమా దర్శకుడు సుకుమార్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో కలిసి ఈ సినిమా పాటల ట్యూన్స్ కోసం స్పెయిన్ వెళ్ళి అక్కడ హంగామా చేయబోతున్నారు.

ఇలా జూనియర్, సుకుమార్ లు ఇద్దరు విదేశాల బాట పట్టి అక్కడ బాగా ఖర్చులు పెట్టి వచ్చిన  తరువాత ఈ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం లండన్ ప్రయాణం కాబోతున్నారు. ఒక వైపు భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ నిర్మాతలకు చేదు అనుభవాలు మిగులుస్తున్న నేపధ్యంలో ‘టెంపర్’ మిగిల్చిన చేదు అనుభవాలను కూడా లెక్క చేయకుండా జూనియర్ తన కొత్త సినిమా విషయంలో మళ్ళీ ఖర్చులు పెంచేస్తూ మరోసారి రాంగ్ స్టెప్ వేస్తున్నాడు అంటూ జూనియర్, సుకుమార్ లపై కామెంట్లు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: