రాజకీయాల ఎత్తుగడలను మించి ‘మా’ సంస్థ అధ్యక్ష కార్యదర్శులుగా ఈ మధ్యనే ఎన్నికైన ఇద్దరు రాజాలు రాజేంద్రప్రసాద్ శివాజీరాజాలు కలిసి ఒక సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. గత 30 సంవత్సరాలుగా తమ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ‘రాజా అండ్ రాజా క్రియేషన్స్’ పేరుతో   నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసామని శివాజీరాజా చెపుతున్నా ‘మా’ సంస్థ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్న వీరిద్దరూ ఇప్పుడు ఒక నిర్మాణ సంస్థ కార్యకలాపాలలో భాగస్వాములుగా మారడం సంచలనంగా మారింది.

ఈ నిర్మాణ సంస్థ తరఫున కొన్ని టెలివిజన్ కార్యక్రమాలు మరికొన్ని సినిమాలను నిర్మించే ఉద్దేశ్యం తమకు ఉంది అని శివాజీరాజా నిన్న జరిగిన ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలియచేసాడు. త్వరలోనే ఈ టివి కోసం ఒక కార్యక్రమాన్ని తమ నిర్మాణ సంస్థ తరఫున మొదలు పెడుతున్నామని శివాజీరాజా తెలిపాడు.

ప్రముఖ సినిమా నటుడు కైకాల సత్యనారాయణ, దర్శకుడు  ఎస్వీ కృష్ణారెడ్డిలతో పాటు అనేకమంది సినిమారంగ ప్రముఖులు ‘రాజా అండ్ రాజా క్రియేషన్స్’ ప్రారంభోత్సవానికి వచ్చి ఈ ఇద్దరి రాజాలను అభినందించారు. ‘మా’ సంస్థ అధ్యక్ష కార్యదర్శులుగా సినిమా రంగం, టివి రంగాలకు చెందిన అందరి ప్రముఖులతో ఈ ఇరువురి రాజాలకు మంచి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఈ నిర్మాణ సంస్థ అతిత్వరలోనే అభివృద్ధి చెందుతుంది అని అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అయితే ‘మా’ సంస్థ పరపతిని వ్యక్తిగత ప్రయోజనాలకు కొందరు వాడుకుంటున్నారు అంటూ ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించిన ఈ రాజాలు ఇద్దరూ అటువంటి కామెంట్స్ వీరిపై కూడ రాకుండా జాగ్రత్తలు తీసుకోగలరా? అన్నదే ప్రశ్న.. 



మరింత సమాచారం తెలుసుకోండి: