ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసి మెప్పించగల సామర్ధ్యం ప్రకాష్ రాజ్ సొంతం. అయితే అతడి ప్రతిభతో పాటుగా అతడికి సంబంధించిన వివాదాలు కూడ ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ప్రకాష్ రాజ్ సన్నిహిత మిత్రులలో తనికెళ్ళ భరణి పేరు ఎన్నడూ వినిపించలేదు. అసలు వారిద్దరూ కలిసి మీడియా ముందుకు కాని ఫంక్షన్స్ లో కాని కనిపించిన సందర్భాలు లేవు. 

అయితే ప్రకాష్ రాజ్ తన ఆప్తమిత్రుడని మీడియాకు నిన్న ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు తనికెళ్ళ భరణి. అంతేకాదు ప్రకాష్ రాజ్ వ్యక్తిత్వం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు భరణి. ‘మృగం’ సినిమా షూటింగ్ లో తొలిసారి ప్రకాష్ రాజ్ ను తనికెళ్ళ భరణి చూశాడట. చూడగానే వీడెవడ్రా ఇంత పొగరుగా ఉన్నాడు అంటూ ఫీల్ అయ్యానని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నాడు భరణి. 

అయితే ప్రపంచాన్ని ఇంత చదివిన తాను ప్రకాష్ రాజ్ విషయంలో ఎటువంటి తప్పు చేసానో ఆ తరువాత తనకు అర్ధం అయింది అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు తనికెళ్ళ భరణి. ప్రకాష్ రాజ్ సెలెబ్రెటీగా మారిపోయి ఎంత సంపాదించినా మధ్యతరగతిలోని మాధుర్యాన్ని అతను మరిచిపోలేదు అంటూ కామెంట్స్ చేసాడు భరణి. తన వంట తనే చేసుకోవడానికి తన బట్టలు తనే ఉతుక్కోవడానికి ఇప్పటికీ ప్రకాష్ రాజ్ ఇష్టపడతాడు అన్న విషయాన్ని బయట పెట్టాడు భరణి. 

గతంలో ‘గంగోత్రి’  సినిమా షూటింగ్ సమయంలో  తనకు ఆపరేషన్ జరిగినప్పుడు  పదకొండురోజులపాటు అన్నం కూర పచ్చడీ అన్నీ స్వయంగా వండి తనకు తీసుకొచ్చి ఒక తోడబుట్టిన వాడిలా చూసుకున్నాడు అంటూ అప్పటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు భరణి. ఆ అభిమానంతోనే తాను రాసిన  ‘శబ్బాష్ రా శంకరా’ పుస్తకానికి ముందు మాటలో  ఆత్మబంధువు ప్రకాష్ రాజ్ అంటూ అతడి వ్యక్తిత్వం గురించి వ్రాసానని చెపుతూ నిరంతర చైతన్యంతో ఉండే ప్రకాష్ రాజ్ ను ‘చేతుల్లోంచి వదులుకోలేం అలాగని దగ్గర పెట్టుకోలేం’ అంటూ తనికెళ్ళ భరణి చేసిన విలక్షణ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: