తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి భారతీయ సినిమా రంగాన్ని కూడ షేక్ చేసిన ‘బాహుబలి 2’ కంక్లూజన్ కు సంబంధించిన ఒక ముఖ్య వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ఇప్పటివరకు ‘బాహుబలి’ బిగినింగ్  చిత్రీకరిస్తున్నప్పుడు ‘బాహుబలి 2’ కు సంబంధించిన షూటింగ్ కూడ దాదాపు 40 శాతం చిత్రీకరణ పూర్తి అయింది అంటూ వార్తలు వచ్చాయి. ‘బాహుబలి’ ప్రమోషన్ సందర్భంలో కూడా ఇంచుమించు ఇదే అర్ధం వచ్చేలా రాజమౌళి మాట్లాడుతూ వచ్చాడు. 

అయితే రాజమౌళి ఇప్పటివరకు తీసిన ‘బాహుబలి 2’ షూటింగ్ కు సంబంధించి తీసిన సన్నివేశాలను మళ్ళీ రీషూ ట్ చేసే ఉద్దేశంలో ఉన్నాడని టాక్. దీనికి కారణం ‘బాహుబలి 2’ కథలో చోటుచేసుకుంటున్న భారీ మార్పులు అని అంటున్నారు. ‘బాహుబలి’ ఘన విజయంతో ‘బాహుబలి 2’ పై మరింత భారీ అంచనాలు పెరిగిపోడంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

మొదట్లో ఈ నెలలో ‘బాహుబలి 2’ షూటింగ్ మొదలు పెట్టాలని రాజమౌళి ఆలోచించినా  ఈసినిమా కు సంబంధించి కథకు సంబంధించిన చర్చలు పూర్తి కాకపోవడంతో పాటు మూల కధలో కొన్ని ప్రధాన మార్పులుచేయాలని రాజమౌళి రచయిత విజయేంద్ర ప్రసాద్ నిర్ణయించుకోవడంతో కొన్ని కొత్త పాత్రలు కూడ ‘బాహుబలి 2’ లో క్రియేట్ అవుతున్నాయని తెలుస్తోంది.  

దీనితో ఇప్పటికే షూట్ చేసిన కొన్ని సీన్స్ రీషూట్ కధలో మలుపులకు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో రైటర్ విజయేంద్రప్రసాద్ తో మరో బృందం రాత్రి పగలు  నిరంతరం వర్క్ చేస్తోందని తెలుస్తోంది. దీనికి తోడు ఈ సినిమాకు కొంత సెట్ వర్క్ చేయాల్సి ఉందనీ  ఆ డ్రాయింగ్స్ అన్ని రాజమౌళి స్వయంగా చూస్తున్నాడని తెలుస్తోంది. దీనితో  అన్నీ పక్కాగా కుదిరాకే అక్టోబర్ చివరిలోకాని లేదా డిసెంబర్ నుండి ‘బాహుబలి 2’ మొదలు పెట్టాలని రాజమౌళి నిర్ణయం ఇప్పటికే తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈవార్తలే నిజం అయితే ప్రభాస్ కు మరింత టెన్షన్ మొదలవుతుంది అనుకోవాలి. ఈ సినిమా పూర్తి అయితే కాని మరో సినిమా చేయలేని ప్రభాస్ కు ఈ కష్టాలు తీరేది ఎప్పుడో...



మరింత సమాచారం తెలుసుకోండి: