అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన కార్యవర్గం ఎంపికైంది. ఆటా ధర్మకర్తల మండలి సమావేశం నెవాడాలోని లాస్ వెగాస్‌లో ఈ జనవరి 14న నిర్వహించారు. ఆటా నూతన అధ్యక్షుడిగా కరుణాకర్ ఆసిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆటాబోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు లాస్ వేగాస్, కాలిఫోర్నియాలలోని తెలుగువారు సహా 200 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డికి మాజీ అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి బాధ్యతలు అప్పగించారు. ఆసిరెడ్డితో పాటు, కొత్తగా ఎన్నుకోబడిన ధర్మకర్తల మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. 


 
2017 నుంచి 2020వరకు గానూ ఆటా సభ్యుల ద్వారా ఎన్నికైన 13 మంది నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భువనేశ్ బూజల, పరశురం పిన్నపురెడ్డి, వినోద్ రెడ్డి కోడూరు, జయంత్ చల్ల, క్రిష్ణ ద్యాప, రవీందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘువీర్ బండారు, మురళీ బొమ్మనవేని, సౌమ్య కొండపల్లి, కిరణ్ పాశం, రిందా కుమార్ సామ, శరత్ వేముల ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యనిర్వాహక, ధర్మకర్తల బృందం సభ్యులు ఆటా రాజ్యాంగం దాని అనుబంధ చట్టాలను గౌరవించి, పాటిస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం పరమేష్ భీంరెడ్డిని ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎన్నుకుంది. అధ్యక్షుడు ఆసిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా స్థాపించబడిన ప్రధాన లక్ష్యాలను సభికులకు గుర్తుచేశారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు జాతికి, వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకునేందుకు, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు, ఇతర అంశాల్లో ప్రోత్సహించడానికి ఆటా అన్ని వేళలా కృషిచేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: