అమెరికాలోని అట్లాంటాలో ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ జార్జియా తెలుగు బ్రాహ్మణ అసోసియేషన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ ఐ.వై.ఆర్ కృష్ణారావు స్కైప్ ద్వారా దీనిని ప్రారంభించారు. అనంతరం అట్లాంటాలోని 150 తెలుగు బ్రాహ్మణ కుటుంబాలని ఉద్దేశించి మాట్లాడారు. వెల్ఫేర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించారు.
అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అందరూ ఐక్యతగా ఉండాలని, ఎంటర్ప్రన్యూర్లుగా ఎదగాలని, సామాజిక బాధ్యతతో బీద బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి చేయాలని సూచించారు. అట్లాంటాలోని మిడ్వే పార్కులో మొట్టమొదటి ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ సభను నిర్వహించారు. వేదమంత్రాల నడుమ సూర్య, గణపతి ఆరాధనతో జ్యోతి ప్రజ్వలన చేసి వేదోక్తంగా విజయా లంక కార్యక్రమాన్ని ప్రారంభించారు.