విదేశాల్లో ఉంటూ స్వదేశంలో జరిగే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోస్టల్ బ్యాలెట్ లేదా ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సిఫారసులను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం కేంద్రానికి ఆదేశాలు జారీచేసింది. ఎన్నారైలకు ఓటు హక్కు కల్పించడానికి కేంద్రం తీసుకున్న చర్యలను, సలహాలను వారం రోజుల్లో కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని సూచించింది. దీనిపై స్పందించిన కేంద్రం పూర్తి వివరాలను మరో రెండు వారాల్లోగా సమర్పిస్తామని ధర్మాసనానికి తెలిపింది.