పాస్పోర్టు జారీ నిబంధనల్ని భారత ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఇకపై పాస్పోర్టు పొందాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కాదంటూ తీపికబురు చెప్పింది. ఆధార్, పాన్, జనన తేదీని ధ్రువీకరించే ఇతర పత్రాలు వేటినైనా పాస్పోర్టు పొందేందుకు ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. పాస్పోర్టు నిబంధనల చట్టం 1980 ప్రకారం జనవరి 26, 1989 తర్వాత పుట్టిన వారెవరైనా బర్త్ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంది. అయితే, ఈ నిబంధనల్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేత బిశ్వాల్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకె సింగ్ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ఎల్ఐసీ బాండ్లు ఇలా వీటిలో దేనినైనా పాస్పోర్టు కోసం దాఖలు చేయొచ్చని ఆయన స్పష్టంచేశారు. అంతేకాకుండా 60 ఏళ్లు పైబడిన వారికి, 8ఏళ్ల లోపు చిన్నారులకు పాస్పోర్టు రుసుంను 10శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. సింగిల్ పేరెంట్ దరఖాస్తుదారులను ప్రోత్సహించేందుకు ఆన్లైన్లో తమ తల్లి, లేదా తండ్రి లేదా సంరక్షకుడి పేరును పేర్కొంటే చాలని, తల్లిదండ్రులిద్దరి పేర్లను పేర్కొనాల్సిన అవసరం లేదని తెలిపారు.