ఇన్నాళ్లూ పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్న హామీలపై రాజకీయ వర్గాలనుంచి సెటైర్లు, విమర్శలు వచ్చేవి. చంద్రబాబు జీవితకాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే మాట కల్లేనని కూడా కొందరు నేతలు వ్యాఖ్యానించారు. జనం వాటిని చూసి పడి పడి నవ్వుకున్నారు కూడా.. ఇప్పుడు ఇంటిలోని పోరు ఇంతింత గాదయ్యా అంటూ వేమన అప్పట్లో వాపోయినట్లుగా చంద్రబాబుకు తలపోటు కలిగించే వ్యాఖ్య సొంత ఇంటిలోనుంచే వస్తుండటం విశేషం. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ఇజ్జత్ తీసేసేలా సాక్షాత్తూ నందమూరి వారసుల సినిమాలోనే భారీ సెటైర్లు వేసేస్తున్నారు. ఎటూ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు గనుక.. నందమూరి వారి అగ్రహీరో బాలక్రిష్ణ , చంద్రబాబుపై సెటైర్లు వేయడానికి ఇష్టపడకపోవచ్చు గానీ. ఇతర వారసులకు అందుకు అభ్యంతరాలు ఉన్నట్టు లేదు. అందుకే తాజా చిత్రంలో భారీ సెటైర్లు పడబోతున్నాయి.

విషయానికి వస్తే.. త్వరలో విడుదల కానున్న నందమూరి కల్యాణ్ రామ్ సినిమా షేర్ ఆడియో ఆల్బమ్, థియేటర్ ట్రైలర్‌ని  హైదరాబాద్‌లో విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వీటిని విడుదల చేశారు. విశేషం ఏమిటంటే రాష్ట్రక ముఖ్యంమంత్రి కల్యాణ్‌రామ్‌కు వరుసకు మామయ్య అయిన చంద్రబాబు నాయుడి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరంపై ఈ ప్రమోషనల్ ట్రైలర్‌లో ఒక పసందైన వ్యాఖ్య చేశారు. అది ఇప్పుడు కల్యాణ్ రామ్‌కు చిక్కులు తెస్తుందేమోనని అనుమానిస్తున్నారు కూడా. ఒకవేళ చిక్కులు తేకపోయినా.. కనీసం అసంత్రుప్తులు కలిగిస్తుందని మాత్రం అనుకుంటున్నారు. 


పోలవరం ప్రాజెక్టు, వీడి పెళ్లి జరిగినట్లే ఉంటాయి, కానీ జరగవు, చిరాగ్గా అనే వ్యంగ్య సంభాషణ ట్రైలర్‌లో ఉంది. నటుడు పృధ్వి పలికిన ఈ డైలాగ్ ఖచ్చితంగా ప్రభుత్వానికి భంగపాటు కలిగిస్తుందని సినీ జనాలు భావిస్తున్నారు.  పోలవరం గురించి చంద్రబాబు పదేపదే హామీల ఇచ్చేస్తుంటారు.. సరిగ్గా దానిపైనా.. తెదేపా పాలిట్ బ్యూరో సభ్యుడు హరిక్రిష్ణ కుమారుడు కల్యాణరాం చిత్రంలో ఇంత భారీ వెటకారం ఉండడం ఆశ్చర్యమే. చంద్రబాబు వాగ్దాన భంగానికి మరో రుజువుగా ఈ డైలాగ్ కనబడుతుండటంతో ఇది ఒక రేంజ్‌లో పేలుతుందని ఊహిస్తున్నారు. సినిమా విడుదలయ్యాక ఈ డైలాగ్ ఉంటుందా లేక రాజకీయ ఒత్తిడిలో మాయమవుతుందా అనేది అర్థం కావాలంటే వేచి చూడాల్సిందే మరి. చిరాగ్గా....


మరింత సమాచారం తెలుసుకోండి: