ఆంధ్రప్రదేశ్ లో నారావారిపల్లే అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. సిఎం చంద్రబాబునాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో శుక్రవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక నిన్న సాయంత్రమే ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు, చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు సతీమణి ఇందిర, కోడలు నారా బ్రాహ్మణిలు చిన్నారి దేవాన్ష్తో కలిసి నారావారిపల్లెకు చేరుకున్నారు.
తన మనవడు దేవాన్ష్కు తలనీలాల తీయించేందుకు గురువారం సాయంత్రం నారావారిపల్లెకు చేరుకున్న చంద్రబాబు శుక్రవారం ఉదయం 7 గంటలకు నాగాలమ్మ గుడికి చేరుకున్నారు. ముందుగా నాగాలమ్మతల్లి కట్ట చుట్టూ చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ప్రదక్షిణలు చేశారు. అనంతరం కులదైవం నాగాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ మద్య అన్నప్రసాసనం కార్యక్రమం కూడా పెద్ద హంగామానే జరిగింది.
ఇకపోతే నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురువారం సాయంత్రం ఎల్ఈడీ విద్యుత్ వీధిలైట్లను ప్రారంభించారు. న్యూఢిల్లీకి చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ విద్యుత్ పొదుపు చేయడానికి పైలెట్ ప్రాజెక్టుగా కందులవారిపల్లె పంచాయతీని ఎంపిక చేసింది.అందులో భాగంగా రూ.5.60 లక్షలతో 160 ఎల్ఈడీ బల్బులను మంజూరు చేశారు
మనవడు దేవాన్ష్ కి అన్నప్రాసనం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
తాజాగా మనవడి తలనీలాలు కార్యక్రమం లో ఆయన కుటుంబ సభ్యులు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రెండు కుటుంబాల నుంచి సుమారు 25 మంది వచ్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటు స్థానికులు 200 మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో చంద్రబాబు రెండు రోజుల పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.దీంతో నారావారిపల్లెలో సందడి నెలకొంది.