ఇన్నాళ్లూ ఇంటి బయట బహిరంగ స్థలాల్లో, హోటళ్లలో, దాబాల్లో చేసే వంట తినకూడదని వైద్యులు చెప్పడం మనం చూస్తూ వచ్చాం కానీ.. ఇంటి వంట కూడా విషాహారంగా మారి దీర్ఘకాలంలో మానవ శరీరానికి తీవ్ర హాని కలుగ చేస్తోందని తాజా వైద్య పరిశోధనలు బయటపెట్టాయి. ముఖ్యంగా క్లోరిన్ కలిపిన కుళాయి నీళ్లు, అయోడిన్‌తో కూడిన ఉప్పుతో వంట చేస్తే ఆ ఆహారం హానికరమైన విషపదార్థంగా మారే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

 

కుళాయి నీరు, ఉప్పతో చేసిన ఆహారంలో ఇంతవరకు వైద్యశాస్త్రం ఎరుగని కొత్త అణువులు ఉన్నట్లు లండన్ పరిశోధక బృందం కనిపెట్టింది. సాధారణంగా కుళాయి నీటిని మనం తాగడానికి లేదా దాంతో వంటచేయడానికి ముందు క్లోరిన్ కలపడం ద్వారా హానికారక బాక్టీరియా లేకుండా చేస్తుంటారు. అయితే క్లోరిన్ లేక అమ్మోనియా ఉపయోగించి చేసే క్లోరోమైన్ రసాయనాలను నీటిలో కలిపినప్పుడు నీటి రసాయన స్వరూపం దెబ్బతింటోందని పరిశోధకులు కనిపెట్టారు. ఇలా క్లోరిన్ కలిపిన నీటితో అయోడిన్‌ ఉన్న ఉప్పును కలిపి వంట చేస్తే అది ఒక రకం యాసిడ్‌ను రూపొందిస్తోందని ఇది ఆహారాన్ని విషంగా మార్చే ప్రమాదముందని వీరంటున్నారు.

 

వివిధ రకాల కుళాయి నీటిని, అయోడిన్ ఉన్న ఉప్పును కలిపి వివిధ ఉష్ణోగ్రతల వద్ద వంట చేసినప్పుడు ఇంతవరకు తెలియని 14 కొత్త అణువులను గుర్తించామని, వీటిలో కొన్ని అణువులు 50 నుంచి 200 రెట్లు అధికంగా విషపూరితంగా ఉన్నాయని లండన్ పరిశోధక బృంద నేత  డాక్టర్ జాంగ్ తెలిపారు. ఈ విష అణువులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కల్గిస్తాయని, వీటి ప్రభావ పలితం ఏమేరకు ఉంటుందన్నది ఇంకా కనుగొనాల్సి ఉందని జాంగ్ తెలిపారు.

 

రోజుకొకటిగా వైద్య పరిశోధనలు ఆహారం విషయంలో చేస్తున్న హెచ్చరికలు చూస్తుంటే మరగబెట్టి కాచిన నీటితోనే వంట కూడా చేస్తే బాగుంటుందనిపిస్తోంది. మొత్తంమీద ఇలా క్లోరిన్‌లు, అమ్మోనియాలు కలిపిన శుభ్రమైన నీటి కంటే సాంప్రదాయికంగా పూర్వీకులు అవలంబించిన వేడి నీటి పద్ధతికి మళ్లీ వెళితేనే మంచిదనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: