చంద్రబాబును సొంత కోడలు బ్రహ్మణి ఇబ్బంది పెడుతోందా..? ఏరికోరి బావమరిది కూతుర్ని ఏకైక కొడుకు లోకేశ్ కు చేసుకుంటే ఇప్పుడు తానే ఏకు మేకులా తయారయ్యిందా..? అవునంటూ బాబు వ్యతిరేక పత్రిక సాక్షి ఓ కథనం ప్రచురించేసింది. ఇంతకీ సాక్షికి అంత ఉత్సాహం కలిగించేలా బ్రహ్మణి చేసిందేమిటి.. మామకు ఏ విషయంలో తలనొప్పిగా తయారయ్యారు..?

వివరాల్లోకి వెళ్తే.. ఎప్పుడూ ఇంటి వ్యవహారాల్లోనో, హెరిటేజ్ పనుల్లోనో బిజీగా ఉండే బాబు కోడలు బ్రహ్మణి ఆ మధ్య హఠాత్తుగా ప్రెస్ మీట్ పెట్టారు. గ్రూప్ 1, 2 పరీక్షల కోసం ప్రిపేరయ్యేవారికి ఎన్టీఆర్ ట్రస్టు తరపున కోచింగ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఉన్నట్టుండి బాబు కోడలు తెరపైకి రావడంతో అనేక ఊహాగానాలు బయలు దేరాయి. దీన్ని ఎవరికి అనుకూలంగా వారు మలచుకుంటున్నారు. 

బాబును ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ప్రస్తుతం పని చేస్తున్న సాక్షి పత్రిక బ్రహ్మణి ప్రెస్ మీట్ ను కూడా తనకు అనుకూలంగా మార్చేసుకుంది. బ్రహ్మణి ప్రకటన మామ చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసిందంటూ కథనం అల్లేసింది. కోడలు ప్రకటనపై ఎలా ప్రతిస్పందించాలో తెలియక బాబు ఇబ్బంది పడుతున్నారని ఊహించేసింది. మరి కోడలు ప్రకటన బాబును అంతగా ఎందుకు ఇబ్బంది పెట్టింది..

ఎందుకంటే.. ఏపీలోవేలాది సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ సర్కారులో వివిధ శాఖల్లో లక్షన్నర వరకూ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. అయితే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా బాబు ఏ ఉద్యోగాలకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. మరోవైపు తెలంగాణ వరుస ఉద్యోగ ప్రకటనలతో దూసుకెళ్తోంది. ఈ సమయంలో గ్రూప్ పరీక్షలకు కోచింగ్ ఇస్తామంటే అది తెలంగాణ నిరుద్యోగులకే ఉపయోగపడుతుంది.

అంటే మామగారు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్న సంగతి ఇన్ డైరెక్టుగా అందరికీ డప్పుకొట్టి చెబుతున్నారని టీడీపీ నేతలే ఫీలవుతున్నారంటూ వారి పక్షాన సాక్షి పత్రిక ఫీలయ్యింది. వారెవా.. మొత్తానికి సాక్షి ఈ ఇష్యూను కూడా బాగానే వాడేసుకుందన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: