ఎలక్ట్రానిక్ మీడియాకు ఏదైనా వివాదాస్పద అంశం దొరికిందంటే చాలు.. ఇక దానిపై నిరంతరం లైవ్ కవరేజ్ ఇస్తూ ఉతికి పారేస్తాయి. ఇక ఆ ఛానల్ టీవీ 9 అయితే వేరే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రావర్సీ లైవ్ లు ఇవ్వడంలో టీవీ9 పెట్టింది పేరు. సోమవారం టీవీ9 కు అలాంటి బ్రహ్మాండమైన ఛాన్స్ దొరికింది. అదేంటంటే విజయవాడలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కటౌట్ ఎక్కి ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకుంటానని బెదిరించడం. 

సీఎం క్యాంపు ఆఫీసు దగ్గర సహజంగానే మీడియా కన్ను ఉంటుంది. టీవీ9 అదృష్టవశాత్తూ ఆ సమయంలో టీవీ9 విశాఖ రిపోర్టర్ అశోక్.. అక్కడే ఉన్నాడు.. సాధారణంగానే ఇలాంటి ఇష్యూల్లో రెచ్చిపోయే అశోక్ ఇలాంటి అంశం దొరికితే ఇక ఊరుకుంటాడా.. అందులోనూ చంద్రబాబు కటౌట్ పెకి ఎక్కిన వ్యక్తి అక్కడ నుంచి ఓ సుసైడ్ నోట్ కింద పడేశాడు. అందులో తాను పవన్ అభిమానినని రాసుకొచ్చాడు. 

ఇంకేమంది.. కావలసిన మసాలా దొరికేసింది. గోవిందరాజులు అనే సదరు వ్యక్తిది కర్నూలు జిల్లా ఆస్పరి మండలం అట్టెకల్లు గ్రామమట. పవన్ పిలుపు మేరక గత ఎన్నికలలో టీడీపీకి పని చేశాడట. తన గ్రామంలో వార్డు మెంబర్ గా కూడా గెలిచాడట. ఎన్నికల సమయంలో రోడ్లు వేయిస్తానని, ఫించన్లు ఇప్పిస్తానని చెప్పాడట. ఖర్చు కూడా బాగానే చేశాడట. ఆ పనులు చేయలేదని తనను గ్రామంలో అంతా తిడుదున్నారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ లేఖలో ఉంది. 

సాధారణంగా అయితే ఈ ఇష్యూని టీవీ9 ఇంకా చింపి చాట చేసి ఉండేదే.. టీవీ9 ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీసుల ప్రయత్నాలు ఫలించాయి. గోవిందరాజులు ఆత్మహత్యాయత్నం గురించి ఆ వ్యక్తిని లైవ్ లో చూపిస్తూ టీవీ9 రిపోర్టర్ అశోక్ కళ్లకు కట్టినట్టు అంతా వివరిస్తున్న సమయంలోనే గోవిందరాజులు కిందకు దిగడం ప్రారంభించాడు. దాంతో సదరు ఆత్మహత్యాయత్నం మొత్తం లైవ్ గా ఇచ్చే ఛాన్స్ టీవీ9 కు దక్కింది. గోవిందరాజులు దిగివచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే.. సీన్ ఇంకెంత హాట్ గా తయారయ్యేదో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: