అమరావతి ప్రాంతంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సెక్రటేరియట్ కట్టేస్తాం.. జూన్ నాటికి కొత్త సెక్రటేరియట్లోకి ఉద్యోగులు వెళ్లిపోవాలి. ఇదీ పలు వేదికలపై మంత్రి నారాయణ పలికిన పలుకులు. ఆరు నెలల్లో కట్టేస్తామన్నారు. ఆఘమేఘాల మీద నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
అర్జంటుగా కొత్త సెక్రటేరియట్ కట్టేయాలన్న ఆత్రుత మంచిదే. కానీ అందుకు అన్ని పరిస్థితులూ అనుకూలించాలిగా. ఆరంభంలోనే టెంపరరీ సచివాలయ నిర్మాణం టెండర్ల విషయంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. టెండర్ ఎవరికి దక్కుతుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ సెక్రటేరియట్ కోసం మూడు ప్యాకేజీలుగా పనులు విభజించారు. టెండర్లు పిలిచారు. 6నెలల్లో కట్టగలిగే వారే టెండర్ దాఖలు చేయాలని రూలు పెట్టారు. తీరా బిడ్లు ఓపెన్ చేసి చూస్తే.. కేవలం రెండు కంపెనీలే టెండర్లు దాఖలు చేశాయట. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ కంపెనీలు సర్కారు నిర్దేశించిన 180 కోట్ల కంటే ఎక్కువ ధరకు టెండర్లు వేశాయట.
నిబంధనల ప్రకారం సర్కారు నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ కోట్ చేస్తే ఆ పని అప్పగించరు. అందుకే రేటు తగ్గించుకోమని ఆ కంపెనీలను ఏపీ అధికారులు బతిమాలుతున్నారు. ఆ కంపెనీలు రేటు తగ్గించుకుంటే సరే సరి. లేకపోతే ఏం జరుగుతుంది. అప్పుడు మళ్లీ టెండర్లకు వెళ్లాలి. అంటే మరికొంత జాప్యం అన్నమాట. మరి ఇలా రెండడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే తరహాలో పనులుంటే ఆరునెలల్లో అయినా సెక్రటేరియట్ పూర్తవుతుందా.. ఏమో అనుమానమే.