తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారంలో జరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును ఆర్థిక శాఖ దాదాపు పూర్తి చేసింది. 2016 -17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్షా 35 వేల కోట్ల రూపాయల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.  ప్రణాళికా వ్యయంగా 75 వేల కోట్లు. ప్రణాళికేతర వ్యకంగా 55 వేల కోట్లు ఉండే చాన్సు ఉంది. ఏ రంగానికి ఏ నిధులు కేటాయించాలి..ప్రాధాన్య పథకాల వారీగా వివిధ శాఖల నుంచి ఇప్పటికే ప్రతిపాధనలు తెప్పించుకుంది.

నీటి పారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు రూపాయల బడ్జెట్ కేటాయిస్తామని సీఎం ఇప్పటికే వెల్లడించారు. దానికి అనుగుణంగా  బడ్జెట్ శాఖ ప్రణాళిక సిద్దం చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, కొత్తగా కృష్ణ,గోదావరి నదులపై నిర్మించబోతున్న ప్రాజెక్టులను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారు.  మిగతా నిధులను చాలా వ్యూహాత్మకంగా వినియోగించుకోవాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలపై ప్రణాళిక శాఖ రూపొందించిన పుస్తకాన్ని ప్రణాళిక శాఖ కార్యదర్శి బిపి ఆచార్య ముఖ్యమంత్రికి అందించారు.

రాష్ట్రంలోని నిరుపేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయాల్సి ఉన్నందున, రైతులకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉన్నందున బడ్జెట్ రూపకల్పనలో ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండే విధంగా చూడాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇప్పటికే 2016-17 బడ్జెట్ రూపకల్పనపై సచివాలయంలో ముఖ్యమంత్రి  సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పన సందర్భంగా గతంలో అనుసరించిన మూస పద్ధతిలో కాకుండా తెలంగాణ ప్రజల అవసరాలు, ప్రభుత్వ కర్తవ్యాలను గమనించి నిధుల కేటాయింపు చేయాలని సూచించారు.

తెలంగాణ 2016-17 బడ్జెట్ రూపకల్పనపై సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్


జిల్లాల వారీగా అన్ని శాఖలు తాము చేసే పనులపై పూర్తి నివేదిక తయారు చేసి ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. మంత్రులు ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎన్ని? వాటిలో ఖర్చయినవి ఎన్ని ? ఇంకా ఏ ఖర్చులు ఉన్నాయి ? తమ శాఖ ద్వారా ఏ పనులు చేయాల్సి ఉంది? వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు కావాలనే విషయంలో పూర్తి స్థాయి అంచనాలు రూపొందించాలని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: