ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన రాష్ట్రపతి భవన్లోని మొఘల్గార్డెన్ ఎన్నో అందాలకు నెలవైంది. తులిప్ పూలతో రాష్ట్రపతి భవన్లోని మొఘల్ గార్డెన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 15 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన మొఘల్ గార్డెన్లో రకరకాల 15 ఉద్యానవనాలు ఉన్నాయి. స్పిరిచ్యుయల్ గార్డెన్లో వివిధ మతాలలో ప్రాధాన్యం కలిగిన 40 రకాల మొక్కలున్నాయి. సందర్శకులకు కనువిందు చేయడానికి 7 రంగుల్లో అందమైన తులిప్ పూలు సిద్ధమయ్యాయి.
ఇదికాక హెర్బల్ గార్డెన్, బయో డైవర్సిటీ గార్డెన్, నక్షత్రశాల గార్డెన్, మ్యూజికల్ గార్డెన్, కాక్టస్ గార్డెన్, న్యూట్రీషన్ గార్డెన్ వంటివి ఉన్నాయి. మ్యూజికల్ గార్డెన్ 12 ఫౌంటెయిన్లతో అందాలు విరజిమ్ముతుంది. కాక్టస్ గార్డెన్లో 80 రకాల కాక్టస్ మొక్కలు, బోన్సాయ్ గార్డెన్లో 250 మొక్కలు ఉన్నాయి. రోజ్ గార్డెన్లో పలుపు, ఆకుపచ్చ వంటి వివిధ రంగుల135 రకాల గులాబీ మొక్కలున్నాయి. కాగా రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఉన్న మొఘల్ గార్డెన్ ద్వారాలు శుక్రవారం నుంచి సామాన్యుల కోసం తెరుచుకోనున్నాయి.
మొఘల్ గార్డెన్ లో సందర్శకుల అభివాదం తెలుపుతున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
ప్రపంచంలోని అతి సందర ఉద్యానవనాల్లో ఒకటైన మొఘల్ గార్డెన్ను చూసేందుకు మార్చి 19 వరకు సామాన్యులకు అవకాశం ఉంటుంది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సోమవారం మినహా గేట్ 35 ద్వారా ప్రవేశించి మొఘల్ గార్డెన్ను వీక్షించవచ్చు. మార్చి 20 న వికలాంగులకు, రైతులకు, సైనికులకు ప్రవేశం కల్పిస్తారు.