ఒక్కో టైమ్ లో ఒక్కో నాయకుడి హవా నడుస్తుంటుంది. ఒకప్పుడు గొప్పగా వెలిగిన నాయకుడు.. కొన్నాళ్లలో చప్పగా మారిపోవచ్చు. అదే మరి రాజకీయం అంటే.అలాంటి నాయకులకు ఓ గొప్ప ఉదాహరణగా ఏపీ మీడియా సలహాదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ ను చెప్పుకోవచ్చు.
రెండేళ్ల క్రితం ఆయన భార్య నిర్మలా సీతారామన్ కేంద్రమంత్రి కావడం ఆయనకు అనుకోకుండా కలిసి వచ్చింది. కేంద్రంతో లాబీయింగ్ చాలా అవసరంగా భావించిన సీఎం చంద్రబాబు ఆయన్ను పిలిచి మరీ పదవి అప్పగించారు. అది కూడా క్యాబినెట్ హోదా పదవి మరి. అంతేకాదు నిర్మలా సీతారామన్ ను ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు.
ఏపీ మీడియా సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన మొదట్లో పరకాల ప్రభాకర్ ప్రభ ఒక వెలుగు వెలిగింది. ముఖ్యమంత్రికి చెందిన ఏ కార్యక్రమమైనా ముందుగా పరకాలే మీడియా ముందుకు వచ్చేవారు. మీడియా సలహాదారు పదవే అయినా.. సమాచార శాఖ మంత్రి రేంజ్ లో ఆయన బిల్డప్ ఉండేది. ఐతే.. కీలక సమయాల్లో నోరుజారి చంద్రబాబును ఇరికించడం ద్వారా ఆయన పలుచన అయ్యారు.
ఓటుకు నోటు కేసుతో పరకాలకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఓటుకు నోటు కేసులోనూ .. గోదావరి పుష్కరాల దుర్ఘటన సమయంలోనూ అమాయకంగా నిజాలు చెప్పి చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. దీనికి తోడు కేంద్రంతోనూ అంత సఖ్యతగా పనులు కాకపోవడంతో చంద్రబాబు కూడా పరకాలను క్రమంగా పక్కన పెట్టేశారు.
దాదాపు ఏడాది కాలంగా పరకాల ప్రభాకర్ ఊసే ఎక్కడా వినిపించడం లేదు. ఆయన తెర మీదా కనిపించడం లేదు. దీనికితోడు ఇప్పుడు సతీమణి నిర్మలా సీతారామన్ కి ఇప్పటికే పదవీ గండం పొంచి ఉంది. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించి పార్టీ పని అప్పగించడం దాదాపు ఖాయమయిపోయింది. దాంతో పాటు ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ కారణాల వల్ల ఇప్పటికే డీ ఫేమ్ అయిన పరకాల పదవి ఉంటుందా.. ఊడుతుందా అన్నది త్వరలోనే తేలిపోతుంది..