తిరుపతిలో నేటి ఉదయం ప్రారంభమైన టీడీపీ వార్షిక వేడుక ‘మహానాడు’లో ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రెండు రోజులు ముందుగానే తిరుపతి సమీపంలోని తన సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్న నారా లోకేశ్... వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక వేడుక ప్రారంభమయ్యేదాకా అక్కడ కనిపించని ఆయన మామ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రాంగణానికి చేరుకోగానే అక్కడ ప్రత్యక్షమయ్యారు.


ఇక వేదికపై ఆసీనులయ్యే విషయంలోనూ బాలయ్య, నారా లోకేశ్ లు తమదైన ప్రత్యేకత చాటుకున్నారు. మొదటి వరుసలో ఆసీనులైన బాలయ్య పార్టీ సీనియర్లు కేఈ కృష్ణమూర్తి, కిమిడి కళా వెంకట్రావుల మధ్య కూర్చున్నారు. బిజీ షూటింగ్ ల కారణంగా బాలయ్య కాస్తంత అలసిపోయినట్లు కనిపించారు. ఇక చివరి వరుసలో కూర్చున్న నారా లోకేశ్... పార్టీకి చెందిన యువనేతలతో కలిసి ఉల్లాసంగా కనిపించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో తన తండ్రి చంద్రబాబు చేసిన ప్రారంభోపన్యాసాన్ని ఆయన ఆసక్తిగా విన్నారు.


కాగా, చివరి వరుసలో కూర్చొన్న నారా లోకేశ్ పార్టీ యువ నేతలతో కలిసి ఉత్సాహాంగా మాట్లాడుతూ కనిపించారు. ఇక తిరుపతిలోని నెహ్రూ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు వేదిక వద్ద భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.మహానాడు ప్రాంగణం వద్ద ఎన్టీ రామారావు, చంద్రబాబు ఫ్లెక్సీతో పాటు బాలకృష్ణ, లోకేశ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నారా లోకేష్‌ను బాహుబలిగా చూపుతూ భారీ కటౌట్ ఆకట్టుకుంటుంది. మహానాడు ప్రాంగణం వద్దకు వేలాదిగా కార్యకర్తలు తరలి వస్తున్నారు.

 

సుమారు ముప్పై వేలమంది కార్యకర్తల వచ్చారని అంచనా. ఇదిలా ఉంటే మహానాడు పండుగకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, పాత్రికేయులకు మూడు రోజుల పాటు నోరూరించే పసందైన శాకాహార, మాంసాహార వంటకాలను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపి మాగంటి బాబు దగ్గరుండి సిద్ధం చేయిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తిరుపతిలో నిర్వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: