ఏపీలోని ప్రకాశం జిల్లాను భూకంపాల భయం వీడటం లేదు. ఇప్పటికే ఆరు నెలల్లో ఆ జిల్లాలో 12 సార్లు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. తాజాగా ప్రకాశం జిల్లాతో పాటు ఆ జిల్లా పొరుగునే ఉన్న శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ భూమి కంపించింది. నేటి తెల్లవారుజామున ఈ రెండు జిల్లాల్లో పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉదయం 8.44 గంటల సమయంలో సుమారు రెండు నిమిషాల పాటు భూప్రకంపనలు రావటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.

ప్రకాశం జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాటు మండలాలు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మండలంలోని పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ఇళ్లల్లోని జనం ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ఈ భూ ప్రకంపనల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలేమీ వెల్లడి కాలేదు.

రెండు జిల్లాల్లోని  ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, కనిగిరి మండలాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్లల్లోని వస్తువులు కింద పడిపోయాయి. కొన్ని చోట్ల పాతబావులు కూలిపోయాయి. గత ఏడాది కాలంలో భూ ప్రకంపనలు రావడం 23వ సారి అని స్థానికులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: