రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మహారాష్ట్ర నుంచి పి. చిదంబరం, పంజాబ్ నుంచి అంబికా సోని, ఉత్తరప్రదేశ్ నుంచి కపిల్ సిబల్, కర్ణాటక నుంచి జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, ఉత్తరాఖండ్ నుంచి ప్రదీప్ టామ్టా రాజ్యసభకు పోటీ చేయనున్నారు. కాగా తెలంగాణలో సంఖ్యాబలం లేని కారణంగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పోటీ చేయడం లేదని పార్టీ నిర్ణయించింది.


మొత్తం 15 రాష్ర్టాల్లో 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆగస్టు 1తో ముగియనుంది. నామినేషన్ల స్వీకరణకు మే 31 తుది గడువు కాగా, జూన్ 11న ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక నుంచి ఒక స్థానానికి మాత్రం ఇంకా ఎవరినీ నిర్ణయించలేదు. మహారాష్ట్ర నుంచి కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే, మాజీ ఎంపీ బాలచంద్ర ముంగేకర్‌లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసినా ఫలితం దక్కలేదు. ఏఐసీసీ కార్యదర్శి అవినాష్ పాండే పదవీకాలం ముగుస్తుండడంతో మహారాష్ట్రలో ఒక స్థానం ఖాళీ కానుంది.


రాజ్యసభలో ఎన్డీఏను చిదంబరం, సిబల్, జైరాం రమేష్‌లు సమర్ధంగా ఎదుర్కొంటారనే ఆలోచనతో వీరిని ఎంపిక చేసినట్లు భావిస్తున్నారు. ఇక టంఖాకు సీనియర్ న్యాయవాదిగా మంచి పేరుండగా, టమ్టా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌కు సన్నిహితుడు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అంబికా సోనీని తిరిగి ఎన్నిక చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే నిర్ణయించింది. ఆమె పంజాబ్ ఎన్నికల ప్రచార కమిటీకి ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక చూస్తోన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డులో ఫెర్నాండేజ్ సభ్యుడు కావడంతో ఆయనకు అవకాశమిచ్చారు. గ్రామీణాభివృద్ధి మంత్రిగా చేసిన జైరాం భూ ఆర్డినెన్స్ బిల్లుతో పాటు పలు అంశాల్లో ఎన్డీఏను విమర్శించడంలో ముందున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: